యాప్నగరం

వాటిని చంపేసేందుకు సర్పంచ్‌లకు పవర్.. తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు

Telangana Govt: పంటను నాశనం చేస్తున్న అడవి పందులను వధించడానికి గ్రామ సర్పంచులకు విచక్షణాధికారాన్ని కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది.

Samayam Telugu 27 Jan 2021, 6:22 pm

ప్రధానాంశాలు:

  • సర్పంచ్‌లకు విచక్షణాధికారాలు
  • అడవి పందుల బెడద నుంచి విముక్తి కోసం..
  • ప్రభుత్వం కీలక ఆదేశాలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
telangana
అడవి పందులు రైతులకు ఎంతగా నష్టం కలిగిస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏపుగా పెరిగిన పంటలో పడి నాశనం చేస్తూ అందినకాడికి బొక్కేస్తుంటాయి. దీంతో రైతన్న బాగా నష్టపోతుంటాడు. వీటి బారి నుంచి పంటను కాపాడుకునేందుకు పంట చుట్టూ విద్యుత్ తీగను ఏర్పాటు చేస్తుంటారు. దీనికి అడవి పంది తగిలితే అక్కడికక్కడే చనిపోయేలా ఆ తీగలో విద్యుత్ ప్రవహిస్తుంటుంది. అయితే, వీటివల్ల ఒక్కోసారి మనుషులు కూడా ప్రాణాలు కోల్పోతుంటారు. అంతేకాక, అడవి పందులు మనుషులపై కూడా దాడులకు పాల్పడుతూ ప్రాణాలు తీసిన ఘటనలూ ఉన్నాయి.
అయితే, పంటను నాశనం చేస్తున్న అడవి పందులను వధించడానికి గ్రామ సర్పంచులకు విచక్షణాధికారాన్ని కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది. ఈ క్రమంలో సర్పంచులను గౌరవ వైల్డ్‌లైఫ్‌ వార్డెన్లుగా నియమించింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972లోని సెక్షన్‌ 4(3) ప్రకారం ఈ నియామకం జరిపింది. ఈ మేరకు అటవీశాఖ ఇన్‌చార్జి ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అటవీయేతర, రక్షిత ప్రాంతాల్లో మాత్రమే అడవిపందులను చంపేందుకు సర్పంచ్‌లకు అనుమతులు లభించాయి. వ్యవసాయ పంటలు, ఉద్యానవనాల పరిధిలోనే కల్లింగ్‌ ఉండాలి కానీ ఏ ఇతర ప్రాంతంలోనూ అడవి పందులకు హాని తలపెట్టరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, దీనివల్ల కొందరు అడవి పందులను విచక్షణారహితంగా వధిస్తారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిర్ణయంపై వన్యప్రాణి సంరక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.