యాప్నగరం

ఆర్టీసీ సంఘాలతో చర్చలకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్!

RTC Stike: ఆర్టీసీ సంఘాల నేతలతో చర్చలకు సీఎం కేసీఆర్ పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. బస్ భవన్‌లో శనివారం ఆర్టీసీ యూనియన్ల నాయకులతో అధికారులు చర్చలు జరపనున్నారు.

Samayam Telugu 26 Oct 2019, 12:07 am
ర్టీసీ కార్మికుల డిమాండ్లపై చర్చలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. శనివారం (అక్టోబర్ 26) ఉదయం 11 గంటలకు ఆర్టీసీ సంఘాల నేతలతో అధికారులు భేటీ కానున్నారు. ఆర్టీసీ వ్యవహారంపై శుక్రవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్.. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ సంఘాలతో చర్చలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Samayam Telugu Kcr2


బస్ భవన్‌లో లేదా రవాణా శాఖ కార్యాలయంలో చర్చలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాలకు ప్రభుత్వం తరఫున ఆర్టీసీ ఎండీ, ఈడీలు హాజరు కానున్నారు. మరోవైపు చర్చలకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. ఆర్టీసీ సమ్మె 20 రోజులకు చేరుకున్నా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో కార్మికుల్లో అసహనం పెరుగుతోంది. పలువురు కార్మికులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. శుక్రవారం గుండె పోటుతో మరో కార్మికుడు మృతి చెందాడు.

Must Read: అశ్వత్థామరెడ్డిపై ఆర్టీసీ కార్మికుడి ఫిర్యాదు

గురువారం నాటి మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఆర్టీసీ సమ్మెకు ముగింపు.. ఆర్టీసీ మూతే అనేలా కేసీఆర్ సంకేతాలు ఇవ్వడం కార్మికుల్లో గందరగోళం కలగించింది. సమ్మె ఇలాగే కొనసాగితే ఆర్టీసీని భూగోళంపై ఎవరూ కాపాడలేరంటూ సీఎం ఘాటు హెచ్చరికలు చేశారు. దీంతో కార్మికులు ఆందోళనకు గురయ్యారు. సీఎం వ్యాఖ్యలపై విపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తాజా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

Also Read: ఆర్టీసీ ముగింపే.. సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

మరోవైపు ఆర్టీసీ సమ్మె శుక్రవారం కీలక మలుపునకు తిరిగింది. జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డిపై ఓ డ్రైవర్ ఫిర్యాదు చేశారు. సంస్థ విలీనం పేరుతో కార్మికులను అశ్వత్థామ రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారని, అనేక మంది కార్మికుల ఆత్మహత్యలకు కారణమయ్యారని ఆరోపిస్తూ కూకట్‌పల్లి డిపోలో పనిచేస్తున్న కోరెపు రాజు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌తో కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని.. వారి ఆత్మహత్యలకు అశ్వత్థామ రెడ్డి కారణమవుతున్నారని రాజు ఆరోపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.