యాప్నగరం

సంజయ్ చేసిన తప్పేంటి.. పబ్లిక్ డొమైన్‌లోకి వచ్చాక లీకేజీ ఎలా అవుతుంది: హైకోర్టు

Telangana High Court: టెన్త్ పేపర్ లీక్ వ్యవహారంలో బండి సంజయ్ రిమాండ్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. సంజయ్‌పై ఉన్న ఆరోపణలు ఏంటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది.

Authored byసందీప్ పూల | Samayam Telugu 6 Apr 2023, 2:58 pm
Bandi Sanjay Kumar: టెన్త్ హిందీ క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో అరెస్టయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రిమాండ్‌ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. హనుమకొండ కోర్టు డాకెట్ ఆర్డర్‌ను సస్పెండ్ చేయాలని కోరుతూ సంజయ్ తరఫున న్యాయవాదులు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది.
Samayam Telugu telangana high court
తెలంగాణ హైకోర్టు


బండి సంజయ్‌పై ఉన్న ఆరోపణలు ఏంటని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పేపర్‌ పబ్లిక్ డొమైన్‌లోకి వచ్చాక లీకేజ్ ఎలా అవుతుందని అడిగింది. బండి సంజయ్ వాట్సాప్‌లో సర్క్యులేట్ చేశారు తప్ప, పేపర్ లీక్‌లో ఆయన ప్రమేయం ఎక్కడుందన్న ప్రశ్నించింది. పేపర్ బయటకు వచ్చాక రాజకీయ నేతగా సర్కులేట్ చేయంటంలో తప్పేంటని అడిగింది. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ఏజీ పేపర్ లీక్ ఘటనలో బండి సంజయ్ కుట్రదారుడని వాదించారు. బండి సంజయ్ ఫోన్ ఇంకా ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. లోయర్ కోర్టులో ఉన్న బెయిల్ పిటిషన్‌పై ఈ రోజు నిర్ణయం తీసుకొనేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఎల్లుండి ప్రధాని పర్యటన ఉన్నందున.. బెయిల్ పిటిషన్‌పై విచారణ ఇవాళే ముగిసేలా ఆదేశాలివ్వాలని కోరారు. దీంతో బండి సంజయ్ బెయిల్ పిటిషన్‌కు హైకోర్టు అనుమతించింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ.. రిమాండ్ క్వాష్ పిటిషన్‌పై విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది.

వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలోని కమలాపూర్‌లో ఈనెల 4న జరిగిన హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సంజయ్‌ను పోలీసులు ప్రధాన నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే. సంజయ్ ప్రోద్బలంతోనే మిగిలిన నిందితులు ప్రశ్నపత్రాన్ని పరీక్షా కేంద్రం నుంచి దొంగతనంగా సేకరించి వాట్సప్‌లో వైరల్‌ చేశారని ఆయనపై అభియోగాలు మోపారు. దీంతో సంజయ్‌పై 120 (బి), 420, 447, 505 (1) (బి) ఐపీసీ, 4 (ఎ), 6, రెడ్‌విత్‌ 8 ఆఫ్‌ టీఎస్‌ పబ్లిక్‌ ఎగ్జామినేషన్‌ యాక్ట్‌-1997, సెక్షన్‌ 66-డి ఐటీ యాక్ట్‌-2008 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అనేక నాటకీయ పరిణామాల మధ్య నిన్న (బుధవారం) సాయంత్రం 6 గంటల సమయంలో హనుమకొండ జిల్లా ప్రధాన మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ ముందు సంజయ్‌ను హాజరు పరిచారు. దీంతో ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ న్యాయమూర్తి రాపోలు అనిత ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం సంజయ్‌ను రిమాండ్ కోసం కరీంనగర్ జైలుకు తరలించారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.