యాప్నగరం

కొత్త చట్టానికి పాత చట్టానికి తేడా ఏంటి?: హైకోర్టు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఎన్నికల నిర్వహణకు గతంలో 109 రోజులు గడువు కోరిన ప్రభుత్వం, గడువు ఎందుకు తగ్గించిందని ప్రశ్నించింది.

Samayam Telugu 14 Aug 2019, 4:11 pm
తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై కోర్టులో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఎన్నికల నిర్వహణపై తాజాగా హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన నూతన మున్సిపల్ చట్టానికి, పాత చట్టానికి తేడా ఏమిటని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. నూతన చట్టం గురించి తెలుసుకోవడానికి ఆ ప్రతిని కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Samayam Telugu HighCourt


ఎన్నికల నిర్వహణకు గతంలో 109 రోజుల గడువు అడిగిన ప్రభుత్వం, ప్రస్తుతం ఆ గడువును ఎందుకు తగ్గించిందని అడ్వకేట్ జనరల్‌ను హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి చట్టప్రకారమే వ్యవహరించానని ఏజీ హైకోర్టుకు నివేదించారు. జీవో నెం.78 ప్రకారమే వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ, ఓటర్ల జాబితా సవరణను చేపట్టామని తెలిపారు.

పాత చట్టం ద్వారానే మున్సిపల్‌ ఎన్నికలు జరుపుతామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే వార్డుల విభజన గందరగోళంగా ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. నూతన చట్టానికి సంబంధించిన పూర్తి వివరాలను శుక్రవారం తెలియజేస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో తరుపరి విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సంబంధించి వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు తదితర అంశాలకు సంబంధించి ప్రక్రియ చేపట్టడం లేదని ఆరోపిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం గతంలో హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల సంఘంతోపాటు మరో ఇద్దరు వ్యక్తులు మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో పిటషన్లు దాఖలు చేశారు. ఈ మూడు పిటిషన్లపై కొంతకాలంగా హైకోర్టు విచారణ జరుపుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.