యాప్నగరం

అనాథ బాలికలను దత్తత తీసుకున్న మంత్రి సత్యవతి రాథోడ్.. ఆమె ఔదార్యానికి జనాలు ఫిదా

రోడ్డుప్రమాదంలో నాన్న, నాన్నమ్మలను కోల్పోయి అనాథలుగా మారిన ఇద్దరు బాలికలను తాను దత్తత తీసుకుని బాగోగులు చూసుకుంటానని హామీ ఇచ్చారు మంత్రి సత్యవతి రాథోడ్

Samayam Telugu 18 Jan 2021, 6:51 am
తెలంగాణ రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ మంచి మనసు చాటుకున్నారు. రోడ్డుప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు పిల్లల్ని అక్కున చేర్చుకున్నారు. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌కు చెందిన రషీద్‌ పాషా(28), అతడి తల్లి జహీరా బేగం(58) ఈ నెల 8వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. పాషా ఇద్దరు కుమార్తెలు అనాథలైనట్లు తెలుసుకున్న మంత్రి ఆదివారం డోర్నకల్‌కు వచ్చారు.
Samayam Telugu పిల్లలతో సత్యవతి రాథోడ్


Also Read: కిడ్నాపర్లుగా మారిన ఆటోడ్రైవర్లు.. కోదాడలో వ్యాపారిని ఎత్తుకెళ్లి రూ.2లక్షల డిమాండ్

నాలుగేళ్ల కరిష్మాని తన ఒడిలో కూర్చోబెట్టుకుని ప్రమాదంలో గాయపడి కాలికి ఆపరేషన్ జరగడంతో వారం రోజులుగా మంచానికే పరిమితమైన తొమ్మిదేళ్ల సుహానాని ఓదార్చారు. ఊహ తెలియని వయసులో ఇంత కష్టమా? ఆ భగవంతుడికి కూడా దయ లేకపాయే? అంటూ మంత్రి కన్నీరు పెట్టుకున్నారు. పిల్లలిద్దరినీ తాను తీసుకెళ్లి ప్రభుత్వ చిల్డ్రన్స్ హోమ్‌లో చేర్పిస్తానని, వారి బాగోగులు తానే స్వయంగా చూసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు.

‘నేనే ఈ రాష్ట్రానికి మంత్రిని కావొచ్చు. మీకు మాత్రం అమ్మనే’ అంటూ పిల్లలకు సత్యవతి రాథోడ్ ధైర్యం నూరిపోశారు. బంధుమిత్రులు ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడు ఇద్దరు పిల్లలను తాము దత్తత తీసుకుంటామని చెప్పారు. పిల్లలకు తోడుగా వచ్చి వారి సంరక్షణ బాధ్యతలు దగ్గరుండి చూసుకుంటామంటే ఒకరికి చిల్డ్రన్స్‌ హోంలో ఉద్యోగం కల్పిస్తామన్నారు. డోర్నకల్‌ నియోజకవర్గానికి చెందిన అవిభక్త కవలలు వీణా వాణీలకు వారి బాగుగోలు చూసుకోవడానికి తోడుగా ఉంటున్న వాళ్ల అమ్మకు ప్రభుత్వమే జీతం ఇస్తున్న విషయాన్ని మంత్రి ప్రస్తావించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.