యాప్నగరం

మహబూబ్‌నగర్: మద్యం తాగే మహిళలే టార్గెట్.. 16 మందిని హత్యచేసిన సీరియల్ కిల్లర్

గతంలో నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చినా అతడిలో ఏమాత్రం పరివర్తన రాలేదు. గతేడాది ఆగస్టులో జైలు నుంచి వచ్చిన తర్వాత నలుగుర్ని హత్యచేసి మూడు రోజుల కిందట పోలీసులకు చిక్కాడు.

Samayam Telugu 28 Dec 2019, 8:17 am
మహిళల ఒంటిపై నగలు, వారి వద్ద ఉన్న డబ్బు కోసం ఏకంగా 16 మందిని హత్యచేసిన నరహంతకుడు, తన సొంత తమ్ముడ్ని కూడా వదలిపెట్టలేదు. కల్లు, మద్యం తాగే మహిళలనే లక్ష్యంగా చేసుకుని ఘాతుకాలకు పాల్పడిన నరరూప రాక్షసుడిని మహబూబ్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలోనే అనేక సార్లు జైలుకు వెళ్లినా అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పురాలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం గుండేడ్‌ గ్రామానికి చెందిన ఎరుకుల శ్రీను మొత్తం 16 మందిని హత్యచేసినట్టు తెలిపారు.
Samayam Telugu Mahabubnagar-604x400


దేవరకద్ర మండలం నవాబుపేట మండలం కూచూరు గ్రామానికి చెందిన అలివేలమ్మ (53) అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు డిసెంబరు 17న హత్యచేశారు. ఆమె మృతదేహాం వద్ద లభించిన ఆధారాలతో దీనిని హత్యగా నిర్ధారించిన పోలీసులు.. పాత నేరస్థుడు ఎరుకల శ్రీను పాత్ర ఉన్నట్లు అనుమానించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. గతేడాది ఆగస్టులో జైలు నుంచి వచ్చిన తర్వాత నలుగుర్ని హత్యచేసినట్టు విచారణలో వెల్లడించాడు.

ఇటీవల మిడ్జిల్‌, భూత్పూర్‌, దేవరకద్ర, కొత్తకోట పోలీసు స్టేషన్ల పరిధిలో నాలుగు హత్యలు చోటుచేసుకోగా, అబ్దుల్లాపూర్‌మెట్‌లోని టీఎస్‌ఎండీసీ ఇసుక యార్డులో ఒక మహిళ అస్థిపంజరం బయటపడింది. యార్డుకు ఇసుకను మిడ్జిల్‌ మండలం కొత్తవాగు సహా ఇతర ప్రాంతాల నుంచి తరలించినట్టు విచారణలో తెలుసుకున్న పోలీసులు.. ఈ హత్యకు పాల్పడింది శ్రీనుగా గుర్తించారు. ఇక, 2007లో తన సొంత తమ్ముడినే హత్య చేసి జైలుకు వెళ్లాడు.

అయితే, పరివర్తన కింద అప్పీలు చేసుకుని మూడేళ్లలో బయటకు వచ్చాడు. తర్వాత పలు కేసుల్లో జైలుకు వెళ్లినా బుద్ధి మాత్రం మారలేదు. జైలు నుంచి రావడం నేరాలకు పాల్పడటమే పనిగా పెట్టుకుని హత్యలకు పాల్పడినట్టు తెలుస్తోంది. షాద్‌నగర్‌, శంషాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో మహిళలను హత్యచేసినట్టు సమాచారం. నిందితుడిపై ఉన్న మొత్తం 18 కేసుల్లో 17 హత్యలు ఉన్నాయి.

కల్లు, మద్యం దుకాణాల వద్దకు వెళ్లే ఒంటరి మహిళలనే టార్గెట్‌గా చేసుకునే నిందితుడు... మాయ మాటలతో వారిని నమ్మించి తీసుకెళ్లి హత్యకు పాల్పడేవాడు. డిసెంబరు 16న మహబూబ్‌నగర్‌లోని ఓ కల్లు దుకాణానికి వెళ్లిన శ్రీను, అక్కడకు వచ్చిన అలివేలమ్మతో మాటలు కలిపాడు. దేవరకద్రలో ఒకరు తనకు రూ.20 వేలు ఇవ్వాల్సి ఉందని, వాటిని ఇప్పిస్తే రూ.4 వేలు ఇస్తానని ఆశపెట్టాడు. ఇది నిజమేనని నమ్మిన బాధితురాలు అతడి వెంట వెళ్లగా.. మార్గమధ్యలో ఇద్దరూ మద్యం సేవించారు. అనంతరం మత్తులో ఉన్న అలివేలమ్మపై దాడిచేసి, తలను నేలకేసి బాది హత్యచేశాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు తీసుకుని పరారయ్యాడు.

ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. శ్రీనును అనుమానించి అదుపులోకి తీసుకొని విచారించగా విషయం బయటపడింది. గతంలోనూ నిందితుడు ఏడుగురు మహిళలను హత్య చేసి పోలీసులకు చిక్కాడు. అలివేలమ్మ హత్యకేసులో పోలీసులు అరెస్ట్ చేస్తే.. తాను పరివర్తనతో బతుకుతున్నానని బుకాయించాడు. పరివర్తనతో బతుకుతున్నా తనను విడిచిపెట్టరా అంటూ హంతకుడు నటనను చూసి పోలీసులే విస్మయానికి గురయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.