యాప్నగరం

27 నుంచి టీచర్లందరూ స్కూళ్లలో హాజరుకావాలి.. సెప్టెంబర్ 1 నుంచి ఆన్‌లైన్ క్లాసులు

ఆన్‌లైన్ క్లాసులకు రంగం సిద్ధమైంది. పాఠశాలలు తెరిచే పరిస్థితి లేకపోవడంతో ఇ-లెర్నింగ్ ద్వారా తరగతులు నిర్వహించాలని, ఇందుకు అనుగుణంగా సన్నద్ధం కావాలని తెలంగాణ ప్రభుత్వం అధికారులకు నిర్దేశించింది.

Samayam Telugu 24 Aug 2020, 9:19 pm
బడి గంటలు తిరిగి మోగే అవకాశం లేని పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించడానికి కేసీఆర్ సర్కార్ ఆమోదం తెలిపింది. ఇందుకు అనుగుణంగా సన్నద్ధం కావాలని అధికారులు, ఉపాధ్యాయులను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ (విద్యా) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామ్‌చంద్రన్ సోమవారం (ఆగస్టు 24) ఉత్తర్వులు జారీ చేశారు.
Samayam Telugu ఆన్‌లైన్ క్లాసులు
Online Classes


డిజిటల్, టీవీ, టీ-శాట్‌ లాంటి నెట్‌వర్క్‌ ఛానల్‌ ప్లాట్‌ఫాంల ద్వారా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నారు. ఇ-లెర్నింగ్, దూర విద్యలో భాగంగా అన్ని పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతులను అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలు తిరిగి తెరిచి సాధారణ తరగతులు కొనసాగించే విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఉపాధ్యాయులందరూ ఆగస్టు 27 నుంచి క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరు కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆన్‌లైన్ క్లాసులకు అవసరమైన ఇ-కంటెంట్, పాఠ్య ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.

ఇంట్లో టీవీలు లేని విద్యార్థుల కోసం గ్రామ పంచాయతీ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ భవనాల్లో ఆన్‌లైన్ తరగతులు వినేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు నిర్దేశం చేశారు. ఆన్‌లైన్ తరగతుల కోసం ప్రభుత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున టీవీలు, ఇతర వస్తువులను కొనుగోలు చేసింది.

కరోనా వైరస్ ప్రభావం ఇంకా కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో స్కూళ్లు తెరిపించడానికి అవకాశం లేనందున.. విద్యా సంవత్సరంపై ఆ ప్రభావం పడకుండా ఆన్‌లైన్ తరగతులు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు నిర్దేశించింది. పరిస్థితులకు అనుగుణంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామని.. అప్పటివరకు అన్ని పాఠశాలలను (విద్యార్థుల కోసం) మూసివేసే ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. (గ్రామాల్లో కొన్ని పాఠశాలలను కరోనా బాధితుల కోసం ఐసోలేషన్ కేంద్రాలుగా వినియోగిస్తున్నారు)

సిలబస్ తగ్గిస్తారా?
అటు ఏపీలో సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు తెరిపించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. సిలబస్ తగ్గిస్తారంటూ వస్తున్న వార్తలపై ఏపీ ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ ప్రతాప్‌ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు అకడమిక్ ఇయర్ క్యాలెండర్ ప్రకటించలేదని తెలిపారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అకడమిక్ ఇయర్ క్యాలెండర్ నకిలీదేనని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 5న పాఠశాలలు తెరిచే నాటికి ఈ సంవత్సారానికి సంబంధించిన అకడమిక్ ఇయర్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

సిలబస్ తగ్గిస్తారు అంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ప్రతాప్ రెడ్డి తెలిపారు. సిలబస్‌ యథావిధిగా ఉంటుందని పేర్కొన్నారు. కేవలం కొన్ని మార్పులు చేస్తామని.. దీనిపై త్వరలో స్పష్టమైన ప్రకటన చేస్తామని ఆయన తెలిపారు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా విద్యాసంస్థలన్నీ మూతబడ్డ విషయం తెలిసిందే.

Also Read: 73 రోజుల్లో వ్యాక్సిన్ వార్తలు నిజంకాదు: సీరమ్ ఇనిస్టిట్యూట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.