యాప్నగరం

Revanth Reddy: బీజేపీ, కాంగ్రెస్ పంచాయతీలోకి బీఆర్ఎస్.. రూ.25 కోట్లపై రాజకీయ దుమారం

Revanth Reddy: బీజేపీ, కాంగ్రెస్ మధ్య రూ.25 కోట్లకు సంబంధించి జరుగుతున్న పంచాయతీలోకి బీఆర్ఎస్ కూడా ఎంట్రీ ఇచ్చింది. మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కు కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చినట్లు ఈటల ఆరోపించగా.. తమపై బీజేపీ కుట్ర చేస్తుందంటూ బీఆర్ఎస్ చెబుతోంది.

Authored byవెంకట్రావు లేళ్ల | Samayam Telugu 22 Apr 2023, 11:57 am

ప్రధానాంశాలు:

  • తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పొలిటికల్ వార్
  • రూ.25 కోట్లపై చెలరేగిన రాజకీయ దుమారం
  • సైలెంట్‌గా ఉన్న కాషాయ నేతలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu revanth
రేవంత్
Revanth Reddy: తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఎన్నికలకు మరో కొద్ది నెలలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. మొన్నటివరకు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా సాగిన టీ పాలిటిక్స్.. ఇప్పుడు ఒక్కసారిగా మలుపులు తీసుకున్నాయి. ప్రస్తుతం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌ మధ్య పొలిటికల్ వార్ తారాస్థాయికి చేరుకుంది. బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్దం నడుస్తోంది.
మునుగోడు ఉపఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు సీఎం కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చినట్లు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉంటుందని ప్రచారం సాగుతున్న క్రమంలో ఈటల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు కూడా కౌంటర్లు ఇస్తోన్నారు.

కేసీఆర్ తమకు రూ.25 కోట్లు ఇచ్చినట్లు నిరూపిస్తే తాను దేనికైనా సిద్దమని ఈటలకు రేవంత్ సవాల్ విసిరారు. తాను భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర శనివారం సాయంత్రం 6 గంటలకు తడిబట్టలతో ప్రమాణం చేయడానికి సిద్దమని, ఈటల సిద్దమా? అంటూ రేవంత్ ఛాలెంజ్ చేశారు. ఈటల రాజేందర్ పూర్తిగా దిగజారి మాట్లాడుతున్నారని, మునుగోడు ఉపఎన్నికల్లో తాము ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు. ఇక ఈటల ఆరోపణలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ స్పందించారు. ప్రజల దృష్టి మరల్చేందుకే ఈటల అలాంటి ఆరోపణలు చేస్తున్నారని, ఈటల భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరకు వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. ఈటల అర్థం పర్థం లేని ఏవేవో ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. దమ్ముంటే ఆయన చేసిన ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు.

అలాగే ఈటల వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ కూడా స్పందించారు. ఈటల తన ఆరోపణలను నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. సాయంత్రం భాగ్యలక్ష్మి దేవాలయానికి రావాలని సూచించారు. అయితే ఈటల వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీలోని నేతలెవ్వరూ స్పందించడం లేదు. దీంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. రేవంత్‌కు కాంగ్రెస్‌లోని నేతలందరూ మద్దతుగా నిలవగా.. ఈటలకు మద్దతుగా బీజేపీ నేతలెవ్వరూ మాట్లాడటం లేదు. దీంతో ఈటల వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని కొంతమంది కాషాయ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదనేలా కాషాయ శ్రేణులు వ్యవహరిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం తమ పార్టీపై బీజేపీ కుట్ర చేస్తుందని అంటున్నారు.


  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
వెంకట్రావు లేళ్ల
వెంకట్రావు లేళ్ల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్‌డేట్స్, పొలిటికల్ అనాలసిస్ అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.