యాప్నగరం

Revanth Reddy: కోమటిరెడ్డికి బహిరంగ క్షమాపణలు చెప్పిన రేవంత్ రెడ్డి.. ఆసక్తి రేపుతున్న కాంగ్రెస్ రాజకీయం!

Revanth Reddy: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగంగా భేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన వీడియోను ట్వీట్ చేశారు. మునుగోడు సభలో అద్దంకి దయాకర్.. కోమటిరెడ్డిని ఉద్దేశించి పరుష పదజాలం వాడటం పట్ల కూడా రేవంత్ సారీ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో వెంకటరెడ్డి క్రియాశీల పాత్ర పోషించారని.. ఆయన్ను అవమానించేలా ఎవరూ మాట్లాడొద్దని టీపీపీసీ చీఫ్ పార్టీ నాయకులకు సూచించారు.

Authored byరవి కుమార్ | Samayam Telugu 13 Aug 2022, 10:27 am

ప్రధానాంశాలు:

  • కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణలు
  • మునుగోడు పాదయాత్రకు ముందు ఆసక్తికర పరిణామం
  • కోమటిరెడ్డి అంటే గౌరవం ఉందన్న టీపీసీసీ చీఫ్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Revanth Reddy-Komatireddy
రేవంత్ రెడ్డి- కోమటిరెడ్డి వెంకటరెడ్డి
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పారు. రేవంత్ రెడ్డి తనను హోంగార్డ్‌తో పోల్చి అవమానించాడని.. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని వెంటనే క్షమాపణలు కోరాలని వెంకటరెడ్డి చేసిన డిమాండ్ పట్ల టీపీసీసీ చీఫ్ స్పందించారు. కోమటిరెడ్డి క్షమాపణలు చెబుతూ ఆయన ట్వీట్ చేశారు. ‘ఈ మధ్య పత్రికా సమావేశంలో హోంగార్డ్ ప్రస్తావన.. మునుగోడు బహిరంగ సభలో అద్దంకి దయాకర్.. కోమటిరెడ్డిని ఉద్దేశించి పరుష పదజాలం వాడటంతో.. పీసీసీ చీఫ్‌ సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. నేను భేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను. ఇలాంటి భాష ఎవరికీ మంచిది కాదు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి.. రాష్ట్ర సాధనలో పాత్ర పోషించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఎవరూ అవమానించేలా మాట్లాడటం తగదు. తదుపరి చర్యల కోసం క్రమశిక్షణా సంఘం చైర్మన్ చిన్నారెడ్డి గారికి సూచన చేస్తున్నా’ అని రేవంత్ రెడ్డి వీడియో సందేశాన్ని పోస్టు చేశారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైంది. మరోవైపు వెంకటరెడ్డి సైతం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. దీంతో ఆయన కూడా బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో.. మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహించగా.. వెంకటరెడ్డి దూరంగా ఉన్నారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. తనను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లగొట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడినందుకు తనను టార్గెట్ చేసి అవమానాలకు గురిచేస్తున్నారన్నారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ.. పార్టీ కోసం పనిచేస్తున్న తనను రేవంత్ రెడ్డి హోంగార్డుతో పోల్చడం బాధ కలిగించిందన్నారు. మునుగోడు ఉపఎన్నిక విషయంలో పార్టీ నేతలు తనను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

తాను కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్నానని.. తెలంగాణ కోసం మంత్రి పదవికి సైతం రాజీనామా చేశానని.. అలాంటి తనపై రేవంత్ రెడ్డి, ఇతర నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడం సరికాదన్న వెంకటరెడ్డి.. చండూరు సభలో ఓ నాయకుడు తన గురించి అసభ్యంగా మాట్లాడితే పార్టీ పెద్దలు వారించలేదని వాపోయారు. తనలాంటి వాళ్లందర్నీ బయటకు పంపించి పార్టీని ఖాళీ చేయించాలని అనుకుంటున్నారని ఆరోపించారు.

మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర ప్రారంభానికి కొద్ది గంటల ముందు వెంకటరెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పడం గమనార్హం. సంస్థాన్ నారాయణపురం నుంచి చౌటుప్పల్ వరకు కాంగ్రెస్ నేతలు పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ పాదయాత్రలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, మధుయాష్కీ తదితరులు పాల్గొననున్నారు. ఈ నెల 16న రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొంటారు.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.