యాప్నగరం

TRS Party: టీఆర్ఎస్ పార్టీలో కుదుపు.. కీలక నేతల ఫోన్లు స్వీచ్ఛాఫ్..!

TRS Party: కేసినో, ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారాలు తెలంగాణలో రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. ఇన్నాళ్లు దర్యాప్తు వరకే పరిమితమైన ఈ కేసుల్లో.. తాజాగా అరెస్టుల పర్వం మొదలైంది. ముఖ్యంగా కేసినో కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఈడీ విచారణకు పిలవడం, ఆయన విచారణ కొనసాగుతున్న సమయంలోనే.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ నాయర్‌ను అరెస్టు చేయడం కలకలం రేపింది. దీంతో తెలంగాణలో మళ్లీ ఈ రెండు అంశాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో చాలామంది నాయకులు తమతమ నేతలకు ఫోన్లు చేస్తున్నారు. అయితే.. వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 28 Sep 2022, 12:12 pm

ప్రధానాంశాలు:

  • తెలంగాణలో మళ్లీ మొదలైన స్కామ్‌ల రచ్చ
  • కేసినో కేసులో విచారణకు హాజరైన ఎమ్మెల్యే
  • ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టుల పర్వం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu symbolic image
ప్రతీకాత్మక చిత్రం
TRS Party: అసెంబ్లీ సమావేశాలకు ముందు జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో.. గులాబీ దళపతి కేసీఆర్ సొంత పార్టీ నేతలను అలెర్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. రాష్ట్రంలో సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు జరగొచ్చని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ హెచ్చరించినట్టు ప్రచారం జరిగింది. ఆయన చెప్పినట్టుగానే హైదరాబాద్‌లో చాలాచోట్ల ఈడీ దాడులు జరిగాయి. ఆ సమయంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం తెలంగాణలో రాజకీయ రచ్చకు తెరలేపింది. ఈ వ్యవహారంలో కారు పార్టీ కీలక నేత పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ కేసులో తాజాగా అరెస్టుల పర్వం మొదలైంది.
కేసినో వ్యవహారం కూడా కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో అలజడి స్టార్ట్ అయ్యింది. రకరకాల ఊహాగాణాలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో టీఆర్ఎస్ క్యాడర్ ఆందోళనలో ఉంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో.. క్లారిటీ కోసం కొంతమంది గులాబీ నాయకులు.. తమతమ నేతలకు ఫోన్లు చేసి ఆరాతీసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ.. టీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతల ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తున్నాయని సమాచారం. దీంతో కార్యకర్తల్లో ఆందోళన మరింత పెరిగింది.

ఇటీవల ఓ ఇంగ్లీష్ దినపత్రికలో వచ్చిన కథనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ కథనం ప్రకారం.. టీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేత, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుందని.. సీఎం కేసీఆర్ అలెర్ట్ చేయడంతో ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారని వార్త రాశారు. ఇది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది. కేవలం ఆయన మాత్రనే కాదు.. చాలామంది నేతలు తమతమ ఫోన్లు పక్కనబెట్టి.. అజ్ఞాతంలోకి వెళ్లారని ప్రచారం జరుగుతోంది. కనీసం తమ అనుచరులకు కూడా అందుబాటులో ఉండటం లేదని సమాచారం.

అయితే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో గానీ.. కేసినో వ్యవహారంలో గానీ.. టీఆర్ఎస్ నేతల పాత్ర ఉన్నట్టు ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారణ కాలేదు. పేర్లు మాత్రం వినిపించాయి. ఈ నేపథ్యంలో కొందరి ఫోన్లు స్విచ్ఛాఫ్ రావడం, వారు అందుబాటులో లేకపోవడంతో.. రకరకాల ఊహాగాణాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇది ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారింది. తాము చేసిన ఆరోపణలు నిజమయ్యాయని కాంగ్రెస్, బీజేపీ నేతలు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇంకా చాలామంది నేతల పేర్లు బయటకు వస్తాయని అంటున్నారు. మొత్తానికి కేసినో కేసు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోందనే చర్చ జరుగుతోంది.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.