యాప్నగరం

అన్ని సదుపాయాలు కల్పిస్తా.. అనుకున్నది సాధించండి: హరీశ్‌ రావు

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన నియోజకవర్గంలోని యుతకు ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించడానికి సిద్ధిపేట యువశక్తి పేరుతో ఒక సదస్సు నిర్వహించారు.

Samayam Telugu 30 Aug 2019, 1:27 pm
ప్రస్తుత పోటీ ప్రపచంలో యువత ఉపాధి సాధించడం సాధారణ విషయం కాదు. చదువు పూర్తి చేయడం ఒక ఎత్తైతే.. ఆ తర్వాత వారి ప్రతిభకు తగ్గ ఉద్యోగం సంపాదించడం మరో ఎత్తు. కేవలం చదువులో సాధించిన అత్యుత్తమ ఫలితాలతోనే ఉద్యోగం పొందడం ఈ రోజుల్లో దాదాపు అసాధ్యం. కలల కొలువు సాధించడానికి కమ్యునికేషన్ స్కిల్స్‌తో పాటు చాలా ఆత్మ విశ్వాసం అవసరం. కాబట్టి యువత సన్మార్గంలో నడుస్తూ, ఎవరిపై ఆధారపడకుండా ఉపాధి, ఉద్యోగం పొందడానికి మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
Samayam Telugu Harish Rao


తెలంగాణలో తొలిసారి ‘సిద్ధిపేట యువశక్తి’ పేరుతో ఓ కార్యక్రమం ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో గురువారం ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నారాయణరావుపేట మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామాల యువతీయువకుల పూర్తి వివరాలు సేకరించారు. అర్హతలను బట్టి వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే చర్యలకు పూనుకున్నారు. యువతకు ఉపాధి అవకాశాలపై అవగాహన పెంచేందుకు సిద్దిపేటలో నిపుణులతో సదస్సు నిర్వహించారు.
Read Also: అడుక్కుంటే వచ్చిన పదవి కాదు.. మంత్రి ఈటల సంచలన వ్యాఖ్యలు

ఈ సందర్భంగా హరీశ్ రావు యువతను ఉద్దేశించి ప్రసంగించారు. జీవితంలో రాణించడానికి యువత ముందు దురలవాట్లను, చెడు గుణాలను వదలాలని సూచించారు. సోషల్‌ మీడియాతో సమయం వృథా చేయకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దాన్ని సాధించడానికి రేయింబవళ్లు పాటుపడాలని హితబోధ చేశారు.

యువతకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తాననీ, అనుకున్నది సాధించాలని సూచించారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. యావత్తు తెలంగాణకు నారాయణరావుపేట మండల యువత స్ఫూర్తిదాయకంగా నిలవాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
Read Also: ‘అధికారం ఉంటే మీ ఫాంహౌసే కూల్చేటోళ్లం.. ఖబడ్దార్ కేసీఆర్’

ఈ సదస్సుకు జెడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు గంపా నాగేశ్వర్, ఐఫోకస్ సంస్థ ప్రతినిధులు విష్ణువర్దన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్, పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్ యువతకు దిశానిర్దేశం చేశారు. సదస్సుకు హాజరైన యువతలో అభద్రతా భావాన్ని తొలగించి, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించే తరగతులు నిర్వహించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.