యాప్నగరం

కేబినెట్ విస్తరణ ఎఫెక్ట్.. బీజేపీ వైపు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చూపు!

Telangana | ముఖ్యమంత్రి కేబినెట్ విస్తరణ టీఆర్ఎస్ పార్టీలో చాలామంది నేతలను అసంతృప్తికి గురిచేసింది. ఇప్పిటికే ఇద్దరు ముఖ్య నేతలు బహిరంగంగానే తమ ఆవేదన వ్యక్తం చేయగా, మరో ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 7 Dec 2022, 2:50 pm
తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చిన 9 నెలల తర్వాత కేసీఆర్ చేపట్టిన మంత్రివర్గ విస్తరణ టీఆర్ఎస్ పార్టీలో చిచ్చు రేపుతోంది. పలువురు ఆశావహులకు మంత్రి పదవులు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. తమ అసంతృప్తిని బాహాటంగానే వెల్లగక్కుతున్నారు. ఇప్పటికే.. కేసీఆర్ తనను కేబినెట్‌లోకి తీసుకుంటానని ఇచ్చిన మాట తప్పి, మోసం చేశారని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ నాయని నరసింహారెడ్డి బహిరంగంగానే విమర్శించారు. గులాబీ జెండాకు తాను కూడా ఓనర్‌నే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu bjp
బీజేపీ


మరోవైపు తెలంగాణలో 11 నుంచి 12 శాతం జనాభా ఉన్న మాదిగలకు చోటివ్వలేదంటూ స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా తన ఆవేదనను బయటపెట్టారు. అయితే తాజాగా మరో ఎమ్మెల్యే కూడా మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయినట్లు తెలుస్తోంది.

Read Also: కేసీఆర్ మాట తప్పారు, టీఆర్‌ఎస్‌కు నేనూ ఓనర్‌నే.. మాజీ మంత్రి నాయిని ఫైర్

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావుకు కేబినెట్‌లో చోటు లభించకపోవడంతో అలక పూనినట్లు సమాచారం. మంత్రి పదవి దక్కకపోవడంతో టీఆర్ఎస్ అధిష్టానంపై గరంగరంగా ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. తన విషయంలో కేసీఆర్ మాట తప్పారని కార్యకర్తల సమక్షంలో ఆవేదన చెందినట్లు సమాచారం.

ఆదివారం కేబినెట్ విస్తరణ జరిగిన వెంటనే హనుమంత రావు బెంగళూరు వెళ్లారని వార్తలు వెలువడుతున్నాయి. సోమవారం జరిగిన బడ్జెట్ సమావేశాలకు ఆయన హజరుకాకపోవడం ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. ఈ నేపథ్యంలో మైనంపల్లి మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ వ్యవహార శైలితో అసంతృప్తికి గురైన ఆయన ఏకంగా బీజేపీలో చేరడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Read Also: కేబినెట్‌‌లో మాదిగలు వద్దా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ఈ మేరకు పార్టీ మార్పుపై సిద్దంగా ఉండాలని తన అనుచరులకు సూచించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే గనక నిజమైతే టీఆర్ఎస్ పార్టీలో మరింత చిచ్చు రేగే అవకాశం ఉందనీ, మరికొంత మంది భంగపడ్డ ఆశావహులు కూడా అదే బాటలో పయనిస్తారని తెలుస్తోంది.

గత డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మైనంపల్లి హనుమంత రావు మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. బీజేపీ నుంచి పోటీ చేసిన సమీప ప్రత్యర్థి ఎన్ రామచంద్రరావుపై సుమారు 73 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో తొలి కేబినెట్‌లోనే ఆయనకు చోటు దక్కుతుందని భావించారు. కానీ, తాజాగా చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో కూడా మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.