యాప్నగరం

కేబినెట్‌‌లో మాదిగలు వద్దా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Telangana | రాష్ట్ర మంత్రివర్గ కూర్పుపై టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. కేబినెట్‌లో అన్ని సామాజిక వర్గాలకు చోటు లభించలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బహిరంగంగానే విమర్శించారు.

Samayam Telugu 9 Sep 2019, 2:51 pm
టీఆర్‌ఎస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. ఇటీవలే గులాబీ జెండాకు ఓనర్లం మేమే.. మంత్రి పదవి అడుక్కుంటే రాలేదు అంటూ.. మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ కూడా మద్దతు తెలపడంతో మరింత ఆజ్యం పోసినట్లయింది. అయితే.. కేబినెట్ విస్తరణలో ఈటల రాజేందర్‌కు ఉద్వాసన పలకకుండా, మంత్రిగానే కొనసాగించడంతో అంతా సద్దమణిగిందని భావించారు. ఆ కేబినెట్ విస్తరణే మరోసారి పార్టీలో అగ్గి రాజేస్తోంది.
Samayam Telugu Rajaiah


కేసీఆర్ తనకు మంత్రి పదవి ఇస్తానని మాట తప్పారంటూ నాయని నరసింహారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలకు తోడుగా స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య కూడా అదేబాటలో నడిచారు. మంత్రివర్గ విస్తరణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ కూర్పుపై తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు.

ముఖ్యంగా తెలంగాణలో తన సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 11 నుంచి 12 శాతం మాదిగ సామాజిక వర్గ జనాభా ఉన్నప్పటికీ, కేబినెట్‌లో మాత్రం మాదిగలు లేరని తన అసంతృప్తిని వెల్లగక్కారు. అయితే అసెంబ్లీలో మాదిగల గురించి ఎవరో ఒకరు మాట్లాడాలని కోరారు. ప్రతిపక్షాలు మాదిగల గురించి మాట్లాడితే.. రాజకీయం చేస్తున్నారంటూ పాలకపక్షం విమర్శిస్తుందని రాజయ్య వ్యాఖ్యానించారు.

డిప్యూటీ సీఎం నుంచి ఉద్వాసనకు గురైన రాజయ్య..
2014 ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏర్పడిన తొలి కేబినెట్‌లో సీఎం కేసీఆర్.. తాటికొండ రాజయ్యకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. అయితే కొద్ది రోజుల్లోనే ఆయణ్ని తొలగించి, మాజీ మంత్రి కడియం శ్రీహరికి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పగించారు. రాజయ్య అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ, ఆయనకు ఉద్వాసన పలికారు. అప్పట్లో ఈ విషయంపై రాజకీయంగా పెద్దఎత్తున దుమారం చెలరేగింది. రాజయ్యను అన్యాయంగా బలిపశువును చేశారంటూ ప్రతిపక్షాలు కూడా ఆయనకు మద్దతుగా నిలిచాయి.

గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ కూడా దక్కదంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. అయినప్పటికీ తొలి జాబితాలోనే ఆయణ్ని స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆ ఎన్నికల్లో రాజయ్య విజయం సాధించినప్పటికీ మంత్రి పదవి మాత్రం దక్కలేదు. అయితే, కేబినెట్ కూర్పుపై తాజాగా రాజయ్య చేసిన వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలలకు దారితీస్తాయో వేచి చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.