యాప్నగరం

‘వాళ్లకు మతం తప్ప మరో అంశం లేదు.. ఓటమి హుందాగా అంగీకరించాలి’

Telangana Municipal Elections ఫలితాలు కాంగ్రెస్, బీజేపీకి కనువిప్పు అవుతాయని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.

Samayam Telugu 24 Jan 2020, 10:28 pm
మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయఢంకా మోగిస్తుందని ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమితి ఛైర్మన్‌ పల్లా రాజేశ్వరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం (జనవరి 24) కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పోలింగ్ అనంతరం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ 90 శాతం సీట్లు కైవసం చేసుకుంటుందని చెప్పారు. ఎన్నికలు ఈవీఎంలతో జరిగినా బ్యాలెట్‌ పేపర్‌తో జరిగినా టీఆర్‌ఎస్‌దే విజయమని వ్యాఖ్యానించారు.
Samayam Telugu party


కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఓటర్లు టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలిచారని రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థుల విజయం కోసం శ్రమించిన పార్టీ కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని హర్షం వ్యక్తం చేశారు.

Must Read: వణికిస్తున్న కరోనా వైరస్.. హైదరాబాద్‌‌లో అలర్ట్

తెలంగాణ ప్రజల నాడి పసిగట్టడం.. సరైన అభ్యర్థులను ఎంచుకోవడంలో ప్రతిపక్షాలు మరోసారి విఫలం చెందాయని రాజేశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం వెల్లడయ్యే ఫలితాలు ప్రతిపక్షాలకు కనువిప్పు అవుతాయన్నారు. బీజేపీకి ఈ ఎన్నికల్లో మతం తప్ప మరో అంశం దొరకలేదని విమర్శించారు. ఆ పార్టీ అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి‌, భట్టి విక్రమార్క నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌, బీజేపీలకు క్యాంపు రాజకీయాల గురంచి మాట్లాడే అర్హత లేదని పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఓటమిని ప్రతిపక్షాలు హుందాగా అంగీకరించాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతోనే టీఆర్‌ఎస్‌కు మంచి ఆదరణ లభిస్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ మీద ప్రజలకు విశ్వాసం ఉందని.. అందువల్లే పార్టీ అన్ని ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తోందని ఆయన వివరించారు.

Also Read: కారు జోరుకు బ్రేకుల్లేవ్.. మున్సి‘పోల్స్’లోనూ అదే రిపీట్: సీపీఎస్ సర్వే

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.