యాప్నగరం

ఆస్తులకు మాత్రమే ఓనర్లు ఉంటారు.. పార్టీలకు కాదు.. టీఆర్ఎస్ నేతలపై కేటీఆర్ ఆగ్రహం

TRS పార్టీకి తాము కూడా ఓనర్లమే అంటూ కొద్ది రోజులుగా నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తులకు మాత్రమే ఓనర్లు ఉంటారనీ, అస్తిత్వాలకు ఉండరని వ్యాఖ్యానించారు.

Samayam Telugu 12 Sep 2019, 10:30 am
త కొద్ది రోజులుగా టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న ఓనర్‌షిప్ వివాదంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. పార్టీకి తాము కూడా ఓనర్లమంటూ చేస్తున్న నాయకుల వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలకు ఓనర్లు ఉండరని స్పష్టం చేశారు. ఆస్తులకు మాత్రమే ఓనర్లు ఉంటారు.. తప్ప అస్తిత్వాలకు ఉండరని తెలిపారు. తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రకార్యదర్శులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న అంతర్గత పరిణామాలపై ఆయన నేతలతో చర్చించారు.
Samayam Telugu KTR


పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని ఏమాత్రం సహించేది లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘించి మాట్లాడటం డెంగీ వ్యాధికన్నా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీ నాలుగు కోట్లమంది తెలంగాణ ప్రజల అస్తిత్వానికి ప్రతీక అని వ్యాఖ్యానించారు. ఎవరికి వారు తాము కూడా ఓనర్‌నే అని మాట్లాడటం సరికాదన్నారు. క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని మంత్రి హెచ్చరించారు.

Read Also: ‘టీఆర్ఎస్‌కు ఆయన ఒక్కరే ఓనర్.. మిగిలిన వారంతా..’

అనంతరం పార్టీ సభ్యత్వ నమోదు, కమిటీల నిర్మాణంపై జిల్లాల వారీగా కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ 60 లక్షల సభ్యత్వాలతో దేశంలోనే బలమైన పార్టీల్లో ఒకటిగా అవతరించిందని తెలిపారు. ఇప్పటికే 50 లక్షల సభ్యత్వాల డిజిటలైజేషన్‌ పూర్తయిందన్నారు. మరో 10 లక్షల మంది కార్యకర్తల వివరాలను కంప్యూట రీకరణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామ, మండల, డివిజన్‌ స్థాయితో పాటు అన్ని రకాల సంస్థాగత కమిటీల నిర్మాణం ఈ నెల 15లోగా పూర్తి చేయాలని నేతలకు సూచించారు.

Read Also: ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నేనింకా పుట్టనే లేదు: కేటీఆర్

వచ్చే దసరా నాటికి రాష్ట్రంలోని 31 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను ప్రారంభించాలని కేటీఆర్ ఆదేశించారు. ప్రస్తుతం 22 చోట్ల పార్టీ కార్యాలయాల నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. మిగిలిన చోట్ల కనీసం ఒక్క గది అయినా నిర్మించి వాటిని కూడా ప్రారంభించాలని సూచించారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికలకు టిక్కెట్లు అధిష్టానమే ఇస్తుందని కేటీఆర్ తెలిపారు. టికెట్ల కేటాయింపులో ఎమ్మెల్యేల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.