యాప్నగరం

Sye Raa: చిరంజీవి, రామ్ చరణ్‌పై పోలీసులకు ఫిర్యాదు

Uyyalawada Narasimha Reddy వారసులు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు.

Samayam Telugu 23 Sep 2019, 2:55 pm
మెగాస్టార్ చిరంజీవి, రామ్‌ చరణ్‌పై ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వంశీయులు హైదరాబాద్‌లో కేసు పెట్టారు. చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ‘సైరా’ సినిమా కథ విషయంలో తమతో ఒప్పందం చేసుకొని మోసం చేశారని ఆరోపించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం (సెప్టెంబర్ 21) ఫిర్యాదు చేశారు. నరసింహా రెడ్డి కథను తమ నుంచి సేకరించి, తిరిగి తమపైనే తప్పుడు కేసులు పెట్టారని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశీయులు ఆరోపించారు.
Samayam Telugu Sye Raa


ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబానికి చెందిన 23 మంది బంధువులను సినిమా యూనిట్ గుర్తించినట్లు ఆ వంశస్థులు చెబుతున్నారు. సినిమా ప్రారంభ సమయంలో తమకు న్యాయం చేస్తామని డైరెక్టర్, ప్రొడ్యూసర్ హామీ ఇచ్చారని చెప్పారు. తమ స్థలాలను, ఆస్తులను వాడుకున్నారని తెలిపారు. 23 మందికి రూ.50 కోట్లు ఇస్తామని చిత్ర యూనిట్ చెప్పినట్లు ఆరోపిస్తున్నారు.

Also Read: ఆన్‌లైన్ సినిమా టికెట్లు బంద్.. మంత్రి చెప్పిన కారణమిదే

తమను ఆర్థికంగా ఆదుకోవాలని ఎన్నోసార్లు రామ్ చరణ్‌ను, సినిమా దర్శకుడిని కలిశామని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు చెప్తున్నారు. అయినా తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం చిత్ర యూనిట్‌ను మరోసారి కలిస్తే.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమని నిర్లక్ష్యంగా మాట్లాడారని.. చేసేదేంలేక పోలీసులను ఆశ్రయించామని చెప్పారు.

కథను తీసుకున్నందుకు డబ్బులు ఇస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేశారని ఆరోపిస్తూ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఉయ్యాలవాడ వంశస్థులు ఫిర్యాదు చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తున్న ‘సైరా’ చిత్రంపై కొంత కాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.

Must Read: గుడికని తీసుకెళ్లి యువతిపై గ్యాంగ్ రేప్.. నిజామాబాద్‌లో ప్రియుడి దారుణం

కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాను ఆక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున్న విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. యంగ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిరంజీవి సరసన నయనతార, తమన్నా నటించారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. విజయ్‌ సేతుపతి, సుదీప్‌, జగపతిబాబు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.