యాప్నగరం

టీఆర్‌ఎస్ నేత చెన్నమనేనికి కేంద్రం షాక్.. భారత పౌరసత్వం, ఎమ్మెల్యే పదవి రద్దు

TRS నేత, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు కేంద్ర హోంశాఖ షాక్ ఇచ్చింది. ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసింది. భారత్‌లో ఎలాంటి పదవులు అనుభవించడానికి ఆయనకు అర్హత లేదని పేర్కొంది.

Samayam Telugu 20 Nov 2019, 8:21 pm
వేములవాడ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ నేత చెన్నమనేని రమేశ్‌కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసినట్లు ప్రకటించింది. చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వానికి అనర్హుడని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ బుధవారం (నవంబర్ 20) సాయంత్రం అధికారిక ప్రకటన జారీ చేసింది.
Samayam Telugu Chennamanini
చెన్నమనేని రమేశ్


చెన్నమనేని రమేశ్‌.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పౌరసత్వం విషయంలో చాలా ఏళ్లుగా కేసు నడుస్తోంది. నరేంద్ర మోదీ తొలి ప్రభుత్వ హయాంలోనూ ఈ అంశం కేంద్రం దృష్టికి వచ్చింది. అయితే.. తాజాగా దీనిపై నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

చెన్నమనేని రమేశ్ భారత పౌరుడు కాదని.. ఆయన ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హుడు కాదని బీజేపీ నేతలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు, విభజన తర్వాత తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పౌరసత్వంపై కేంద్ర హోం శాఖ మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో ఈ అంశంపై విచారణ జరిగింది. సర్వోన్నత న్యాయస్థానం కూడా ఇదే అభిప్రాయం వెల్లడించింది.

ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ ఈ అంశంపై విచారణ చేపట్టింది. పిటిషనర్‌తో పాటు, చెన్నమనేని రమేశ్‌ నుంచి కూడా భారత పౌరసత్వ విభాగం వివరాలు సేకరించింది. అన్ని వివరాలు పరిశీలించిన తర్వాత కేంద్ర హోం శాఖ బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. చెన్నమనేని రమేశ్‌ భారత పౌరుడు కాదని, ఇక్కడ ఎలాంటి అధికారాలు పొందేందుకు అర్హుడు కాదని స్పష్టం చేసింది.

చెన్నమనేని రమేశ్ ఈ దేశంలో పర్యటించాలంటే వీసా తీసుకోవాల్సిందేనని కేంద్ర హోం శాఖ పేర్కొంది. ఆయన చట్టానికి అనుగుణంగా వ్యవహరించాల్సిందేనని స్పష్టం చేసింది. ఆమెరికా నుంచి గతంలో ఆయన వీసా పొందే సమయంలో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారని పేర్కొంది. భారత్‌కు వచ్చిన తర్వాత కూడా చాలా కాలం పాటు ఆయన ఆమెరికా వెళ్లకుండా వీసాను పునరుద్ధరించుకోకుండా వ్యవహరించారని వెల్లడించింది. తప్పుడు సమాచారంతో భారత ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Also Read: భర్తకు గుండెపోటు.. ముందే చనిపోవాలని ఉరేసుకున్న భార్య

ప్రస్తుతం చెన్నమనేని రమేశ్ భారత్‌లో ఎలాంటి పదవులు పొందడానికి ఆస్కారం లేదని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో రమేశ్‌ పౌరసత్వంతో పాటు ఎమ్మెల్యే పదవి కూడా రద్దయినట్లయింది. ఈ నేపథ్యంలో వేములవాడ స్థానానికి ఉపఎన్నికలు నిర్వహిస్తారేమోననే చర్చ జరుగుతుంది. ఉపఎన్నిక నిర్వహిస్తారా, రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారా అనేది కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.