యాప్నగరం

హైదరాబాద్‌లో కరోనా పెరుగుదలపై విజయశాంతి సూటి ప్రశ్న

GHMC Corona Cases: ఇప్పటి వరకూ తక్కువగా ఉన్న కేసులు, మళ్లీ పెరుగుతున్నాయి కాబట్టి.. సరైన సంఖ్యలో పరీక్షలు నిర్వహించలేదేమో అని అనుమానం వ్యక్తం చేశారు. ఒకవేళ సరిగ్గా కరోనా పరీక్షలు చేయకపోయి ఉంటే ఆ నిజం ఒప్పుకోవాలని సూచించారు.

Samayam Telugu 13 May 2020, 3:04 pm
హైదరాబాద్‌లో కరోనా కేసులు విపరీతంగా నమోదు అవుతుండడంపై సినీ నటి, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి స్పందించారు. ప్రజలు నిజాయతీగా 50 రోజులు లాక్ డౌన్ పాటించారని, అయినా కేసులు పెరగడం ఏంటని ప్రభుత్వాన్ని ఆమె సూటిగా ప్రశ్నించారు. కరోనా కేసులు పెరిగేందుకు వైన్ షాపులు తెరవడమే కారణమైతే వెంటనే వాటిని మూసేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకూ తక్కువగా ఉన్న కేసులు, మళ్లీ పెరుగుతున్నాయి కాబట్టి.. సరైన సంఖ్యలో పరీక్షలు నిర్వహించలేదేమో అని అనుమానం వ్యక్తం చేశారు. ఒకవేళ సరిగ్గా కరోనా పరీక్షలు చేయకపోయి ఉంటే ఆ నిజం ఒప్పుకోవాలని సూచించారు. ఈ మేరకు విజయశాంతి బుధవారం ఫేస్‌బుక్, ట్విటర్ వేదికగా స్పందించారు.
Samayam Telugu విజయశాంతి (ఫైల్ ఫోటో)


‘‘జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతిరోజూ కరోనా పాజిటివ్‌ల సంఖ్య పెరగడానికి కారణం ఏమిటి? సుమారు 50 రోజులుగా ప్రజలు నిజాయితీగా లాక్‌డౌన్ పాటించారు కదా? పాజిటివ్‌ల పెరుగుదలకు కేవలం వైన్ షాపులే కారణమైతే వాటిని మళ్ళీ మూసివేయండి. సరైన సంఖ్యలో పరీక్షలు ఇప్పటివరకూ చేయకుంటే ఆ నిజం ఒప్పుకోండి. అన్ని త్యాగాలు చేసిన ప్రజలు అసలు సమస్య అర్థం కాక సతమతమవుతున్నారు. వైన్ షాపులు తెరవడమే ఈ పరిస్థితికి కారణమైతే, అనేక ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే స్థాయిలో పెరుగుదల నమోదై ఉండాలి కదా? ముఖ్యమంత్రి దొరగారు తమ తప్పిదాలను ప్రజల అలవాటు మీదకు నెట్టే ప్రయత్నమేదో చేస్తున్నట్టు కనిపిస్తోంది.’’ అని విజయశాంతి ట్వీట్ చేశారు.

Also Read: undefined

మంగళవారం (మే 12) కొత్తగా తెలంగాణలో 51 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. కరోనాతో మరో ఇద్దరు మరణించారు. మంగళవారం నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 37 కేసులను అధికారులు గుర్తించారు. వివిధ రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు వచ్చిన వలస కార్మికుల్లో 14 మందికి కరోనా సోకింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.