యాప్నగరం

కేసీఆర్‌ను తీవ్ర పదజాలంతో దూషించిన మహిళ.. కేసు నమోదు చేసిన పోలీసులు

Jagityal జిల్లాలో యూరియా కొరతపై నిరసన తెలుపుతూ ఓ మహిళ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను తీవ్ర పదజాలంతో దూషించింది. దీంతో టీఆర్ఎస్ నేతల ఫిర్యాదుతో ఆమెపై కేసు నమోదు చేశారు.

Samayam Telugu 10 Sep 2019, 2:23 pm
Samayam Telugu pjimage (1)
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును అసభ్యపదజాలంతో తీవ్రంగా దూషించిన మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా నెలకొన్న యూరియా కొరతతో రైతులు రొడ్డెక్కిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల రైతుల రోడ్డెక్కారు. సిద్ధిపేటలో ఓ రైతు క్యూలైన్‌లో నిలబడి గుండెపోటుతో మరణించాడు. దీనిపై పెద్ద దుమారం కూడా చెలరేగింది.

ఈ క్రమంలోనే యూరియా కొరతను నిరసిస్తూ.. సెప్టెంబర్ 3న జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో రైతులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొన్న బానావత్ లక్ష్మీ అనే మహిళ ప్రభుత్వ తీరుతో విసిగిపోయి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తీవ్ర పదజాలంతో దూషించింది. గంటల కొద్దీ క్యూలైన్‌లో నిలబడ్డా యూరియా దొరకకపోవడంతో ఆమె కోపం కట్టలు తెంచుకుంది.

కేసీఆర్‌ను రాయలేని మాటలతో దూషిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసీఆర్ తన సొంత గ్రామమైన చింతమడకలో ఒక్కొ కుటుంబానికి రూ. 10 లక్షలు ఆర్థిక సాయం చేశారనీ, రైతులకు మాత్రం న్యాయం చేయడం లేదంటూ లక్ష్మీ మండిపడింది. చింతమడకనే పట్టించుకుంటారా? మిగతా గ్రామాల ప్రజలను పట్టించుకోరా? అని ఆవేదన వ్యక్తం చేసింది.

యూరియా అందుబాటులో ఉంచకుండా రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటూ తీవ్ర పదజాలంతో దూషించింది. లక్ష్మి మాటలను ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఆ వీడియో కాస్త టీఆర్ఎస్ నాయకుల కంటపడింది. దీంతో టీఆర్ఎస్ యువజన విభాగం ఫిర్యాదు మేరకు రాయికల్ పోలీసులు లక్ష్మీపై కేసు నమోదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.