యాప్నగరం

సచివాలయంలో మసీదు కూల్చివేత: హైకోర్టులో పిటిషనర్లకు చుక్కెదురు

TS High Court: మసీదును ప్రభుత్వం కూల్చడాన్ని వ్యతిరేకిస్తూ సయ్యద్ యాసన్, మహ్మద్ ముజాఫరుల్లా, ఖాజా అజాజుద్దీన్ అనే వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.

Samayam Telugu 9 Sep 2020, 6:17 pm
దేవుడికి ప్రార్థనలు మందిరాల్లోనే చేసుకోవాలని ఎక్కడా లేదని, మనసులో దేవుడి ఆలోచన ఉంటే ఎక్కడైనా భగవధ్యానం చేసుకోవచ్చని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. పాత సచివాలయ భవనాలతో పాటు ఆ ప్రాంగణంలో ఉన్న మసీదును ప్రభుత్వం కూల్చడాన్ని వ్యతిరేకిస్తూ సయ్యద్ యాసన్, మహ్మద్ ముజాఫరుల్లా, ఖాజా అజాజుద్దీన్ అనే వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. సచివాలయంలో ఉన్న భూమి వక్ఫ్‌ బోర్డుకు చెందిన భూమి అని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
telangana high court


అందువల్ల మసీదును కూల్చివేయడం చట్ట విరుద్ధమని హైకోర్టుకు తెలిపారు. 657 గజాలు ఉన్న మసీదును కూల్చివేసి 1500 చదరపు అడుగులు స్థలం కేటాయించడంపైనా పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. సచివాలయం కూల్చివేతలో భాగంగా మసీదు కూడా కూలిపోయిందని ఏజీ హైకోర్టుకు తెలియజేశారు. ప్రభుత్వ సొంత ఖర్చుతో కొత్త మసీదును నిర్మిస్తుందన్న విషయాన్ని ఏజీ గుర్తు చేశారు. అయితే, మసీదును ఎక్కడైతే కూల్చారో అక్కడే నిర్మాణం చేపట్టాలని పిటిషనర్లు కోరారు.

ఈ వాదనలు విన్న ధర్మాసనం.. దేవుడికి మందిరంలోనే ప్రార్థనలు చేసుకోవాలని ఎక్కడా లేదని మనసులో ఆలోచన ఉంటే ఎక్కడైనా ప్రార్థించుకోవచ్చని పేర్కొంది. దేవుళ్లు, మతాల కంటే చట్టాలు గొప్పవని అభిప్రాయపడింది. ప్రజా అవసరాల కోసం మసీదులని కుల్చే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని హైకోర్టు తేల్చి చెప్పింది. మసీదు కూల్చితపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తర్వాతి విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.