యాప్నగరం

నాడు వైఎస్సార్‌సీపీకి షాకిచ్చిన నేతకు కీలక పదవి ఇచ్చిన జగన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బహిష్కరణ వేటుకు గురైన నేతకు వైఎస్ జగన్ కీలక పదవి ఇచ్చారు. టీటీడీ సభ్యుడిగా అవకాశం కల్పిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు.

Samayam Telugu 18 Sep 2019, 7:16 pm
వైఎస్ జగన్ సర్కార్ 28 మంది సభ్యులతో టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) పాలకమండలి సభ్యులను నియమించిన సంగతి తెలిసిందే. ఈ 28 మందిలో 8 మంది ఏపీకి చెందిన వారు కాగా.. తెలంగాణకు చెందిన ఏడుగురికి అవకాశం కల్పించారు. తమిళనాడు నుంచి నలుగురు, కర్ణాటక నుంచి ముగ్గురికి ఈ పాలక మండలిలో స్థానం దక్కింది. ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి సభ్యత్వం కల్పించారు. అయితే.. వీరిలో గతంలో వైఎస్సార్‌సీపీ నుంచి బహిష్కరణకు గురైన నేత కూడా ఉండటం చర్చనీయాంశంగా మారింది.
Samayam Telugu ttd


టీటీడీ పాలక మండలిలో తెలంగాణ నుంచి చోటు దక్కించుకున్న వారిలో కె శివకుమార్ కూడా ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఈయణ్ని 2018లో వైఎస్సార్‌సీపీ నుంచి బహిష్కరించారు. తాజాగా కీలక పదవి కట్టబెట్టడం గమనార్హం. అయితే.. అసలు విషయం ఏమిటంటే వైఎస్సార్‌సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమారే. ఆయన స్థాపించిన పార్టీని తప్పనిసరి పరిస్థితుల్లో వైఎస్ జగన్ తీసుకున్నారు.

ఎవరీ శివకుమార్?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి అస్తమయం తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీలో ఇమడలేకపోయిన వైఎస్ జగన్ సొంతంగా పార్టీ పెట్టడానికి సిద్ధమయ్యారు. తన తండ్రి పేరు మీద వైఎస్సార్‌సీపీ పేరుతో సొంత పార్టీ పెట్టుకోవాలనుకున్నారు. అయితే.. అప్పటికే ఆ పార్టీ శివకుమార్ పేరుతో రిజిస్టర్ అయింది.

Also Read: ఇది అసాధారణ వింత ప్రవర్తన.. రక్షణ మంత్రికి కేటీఆర్ ఫిర్యాదు

తన తండ్రి పేరు, రైతులకు ప్రాధాన్యం ఇచ్చేలా వైఎస్సార్‌సీపీ (యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ) పేరు సరిగ్గా సరిపోవడంతో అదే పేరుతో పార్టీ పెట్టాలని వైఎస్ జగన్ భీష్మించుకున్నారు. శివకుమార్‌తో ఒప్పందం చేసుకొని ఆయన దగ్గర నుంచి తీసేసుకున్నారు. శివకుమార్‌కు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో పార్టీకి కీలక నేతలు దూరమవడంతో పార్టీ తెలంగాణ బాధ్యతలను శివకుమార్ పర్యవేక్షించేవారు.

Must Read: కమలానికి గులాబీ ముళ్లు.. బీజేపీకి చెక్, కేసీఆర్ కొత్త స్కెచ్!

2018 డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు ఆ పార్టీ వ్యవస్థాపకుడు, తెలంగాణ యూనిట్ జనరల్ సెక్రటరీ శివకుమార్ షాకిచ్చారు. అధినేత ఆకాంక్షలకు విరుద్ధంగా.. తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుందని పత్రికా ప్రకటన ఇచ్చారు. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపడంతో శివకుమార్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించారు.

‘కేసీఆర్ గతంలో వైఎస్‌ను తిట్టారు. కాబట్టి వైసీపీ అభిమానులు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలి’ అని శివకుమార్ పిలుపునిచ్చారు. దీంతో శివకుమార్‌ను వైసీపీ నుంచి శాశ్వతంగా బహిష్కరించారు. అయితే.. ఆ తర్వాత శివకుమార్ రాజీ పడ్డారు. తెలంగాణలో ఎన్నికల తర్వాత, ఏపీలో ఎన్నికలకు ముందు 2019 మార్చిలో ఆయన వైఎస్ జగన్‌ను కలిశారు. ఆ తర్వాత ఆయణ్ని మళ్లీ పార్టీలో చేర్పించుకొని తెలంగాణ జనరల్ సెక్రటరీగా నియమించారు. తాజాగా టీటీడీ పాలకమండలి సభ్యుడిగా పదవి కట్టబెట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.