యాప్నగరం

అందంగా లేవని భార్యను చంపేసిన భర్త.. అత్తమామల సాయం

కల్యాణికి పెళ్లై నాలుగేళ్లయింది. కొద్దిరోజులకే భర్త అందంగా లేవంటూ ఈసడించుకునేవాడు. ఈడుజోడు కాదంటూ ఇబ్బందులకు గురిచేసేవాడు. అదనపు కట్నం తెస్తేనే కాపురం చేస్తానని నీచానికి దిగాడు. చివరికి..

Samayam Telugu 28 Apr 2022, 3:57 pm
అందంగా లేవు.. నువ్వు నాకు జోడీ కాదంటూ సూటిపోటి మాటలతో సాధించాడు. గర్భం దాల్చిందని తెలిసినా అదనపు కట్నం తేవాలంటూ రాచిరంపాన పెట్టాడు. ఆయనే అనుకుంటే అత్తమామలూ తోడయ్యారు. జీవితం నిత్యం నరకంగా మారినా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం సహించింది. కానీ చివరకి దుర్మార్గులు బలవంతంగా యాసిడ్ తాగించి అమానుషంగా ఆమెను చంపేశారు. కడుపులో బిడ్డతో సహా గర్భిణిని కిరాతకంగా హతమార్చారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ అత్యంత దారుణ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
Samayam Telugu woman


వర్ని మండలం రాజ్‌పేట్ తండాకి చెందిన తరుణ్‌కి మల్కాపూర్‌కి చెందిన కల్యాణితో నాలుగేళ్ల కిందట వివాహమైంది. కొద్దిరోజులు సాఫీగానే సాగిన కాపురంలో కలహాలు రేగాయి. అందంగా లేవంటూ భార్యను సాధించడం మొదలుపెట్టాడు భర్త. నాకు ఈడుజోడు కాదంటూ ఇబ్బందిపెట్టేవాడు. అదనపు కట్నం తీసుకొస్తేనే కాపురం చేస్తానని.. లేకుంటే వదిలేస్తానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. అతనికి అత్తమామలు కూడా తోడయ్యారు.

ఇంతలోనే ఆమె గర్భం దాల్చింది. కడుపులో బిడ్డను మోస్తోందన్న కనీస కనికరం కూడా లేకుండా కోడలిని వేధింపులకు గురిచేశారు. చివరికి ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్న దుర్మార్గులు దారుణానికి ఒడిగట్టారు. మూడు నెలల గర్భంతో ఉన్న కల్యాణికి బలవంతంగా యాసిడ్ తాగించారు. ఆమె కేకలు విని పక్కింట్లో ఉన్న బంధువులు వచ్చేసరికి ఆమె నురగలు కక్కుతూ పడిపోయి ఉంది. వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో ప్రాణాలు విడిచింది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.