యాప్నగరం

జులాయి సినిమా తరహాలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో భారీ చోరీ

Telangana Grameena Bank: నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖలో భారీ చోరీ వెలుగులోకి వచ్చింది. జులాయి సినిమా తరహాలో అర్ధరాత్రి గ్యాస్ కట్టర్ సాయంతో షట్టర్ కట్ చేసి దొంగలు బ్యాంకులోకి చొరబడ్డారు. గ్యాస్ కట్టర్‌తో లాకర్లు తెరిచి నగదు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొని కొంత కరెన్సీ బుగ్గి పాలైంది. పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 5 Jul 2022, 5:55 pm
నిజామాబాద్‌ జిల్లా (Nizamabad) మెండోరా మండలం బుస్సాపూర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు (Telangana Grameena Bank) శాఖలో సినీ ఫక్కీలో భారీ చోరీ జరిగింది. జులాయి సినిమా తరహాలో దొంగలు అర్ధరాత్రి దాటిన తర్వాత గ్యాస్ కట్టర్‌తో షట్టర్ కట్ చేసి బ్యాంక్‌లో చొరబడ్డారు. నిందితులందరూ మంకీ మాస్క్‌లు ధరించి సొత్తు దోచుకెళ్లారు. రూ.7.30 లక్షల నగదుతో పాటు రూ.3 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బ్యాంకులోని లాకర్లను కూడా గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి తెరిచారు. ఈ క్రమంలో అగ్నిప్రమాదం చోటు చేసుకొని కొంత నగదు కాలి బూడిదైంది. కీలక ఫైల్స్ కూడా దగ్ధమయ్యాయి.
Samayam Telugu నిజామాబాద్ TGB బ్యాంకులో చోరీ
Robbery in Telangana Grameena Bank in Nizamabad


తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖ పక్కనే ఉన్న బీఎస్‌ఎన్ఎల్‌ కార్యాలయం నుంచి దొంగలు బ్యాంకులోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. దొంగలు తెలివిగా తొలుత బ్యాంకులోని అలారం సెన్సార్‌ను ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి జరగ్గా, ఆదివారం బ్యాంకుకు సెలవు కావడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చోరీకి గురైన బంగారు ఆభరణాలు రైతులు రుణాల కోసం తాకట్టు పెట్టినవిగా బ్యాంక్‌ అధికారులు తెలిపారు.

ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఆర్మూర్ ఏసీపీ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును విచారిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో బ్యాంక్‌లో దొంగతనం జరగడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి. అంతర్రాష్ట్ర దొంగల ముఠా పని అయుంటుందని పోలీసులు భావిస్తున్నారు. దొంగతనం చేసిన అనంతరం సీసీ కెమెరాకు సంబంధించిన డీవీఆర్‌ను సైతం దొంగలు ఎత్తుకెళ్లిపోయారు.

ఘటనా స్థలం నుంచి పోలీసులు, క్లూస్‌ టీం ఆధారాలు సేకరించారు. దొంగలు ఉపయోగించిన మాస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. చోరీ జరిగిన బ్యాంక్ ఉన్న మార్గంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read:

అగ్నిపథ్ స్కీమ్‌‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

అది ఎత్తుగడే.. రేవంత్‌ రెడ్డితో వివాదంపై జగ్గారెడ్డి సంచలనం!
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.