యాప్నగరం

సిద్దిపేట జిల్లాలో మరోసారి ఉద్రిక్తత.. బ్రిటిష్ పాలనలో కూడా ఇలాంటి అరాచకాలు జరగలేదన్న బండి సంజయ్

సిద్దిపేట జిల్లాలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. అర్ధరాత్రి గౌరవెల్లి నిర్వాసితులను అరెస్టు చేసిన నేపథ్యంలో ఉదయాన్నే మిగిలిన నిర్వాసితులు ఆందోళనకు దిగారు. ఇటు దీనిపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం, పోలీసులపై ఫైర్ అయ్యారు.

Authored byRaj Kumar | Samayam Telugu 13 Jun 2022, 2:32 pm
గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ అడ్డుకుంటారన్న అనుమానంతో అర్ధరాత్రి పోలీసులు పేదల పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మండిపడ్డారు. చిన్నాపెద్దా, మహిళలనే తేడా లేకుండా దౌర్జన్యం చేసి కాళ్లు చేతులు విరగ్గొట్టడం, తలలు పగలకొట్టడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా నిర్వాసితులను ఆదుకోకుండా ఏళ్ల తరబడి సమస్యను నాన్చుతూ కాలయాపన చేయడం అన్యాయమని పేర్కొన్నారు. ఉన్నట్లుండి అర్ధరాత్రి అకస్మాత్తుగా దాడులు చేయడం ఆటవికమని ఆయన మండిపడ్డారు.
Samayam Telugu బండి సంజయ్


రజకార్ల పాలనలో, బ్రిటిష్ పాలనలో కూడా ఇట్లాంటి అరాచకాలు చేయలేదేమోనన్నారు.. ఇకనైనా కేసీఆర్ ఫాంహౌస్ నుంచి పాలించడం మానుకోవాలని హితవు పలికారు. మహిళల పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించడం దుర్మార్గమన్నారు. అసలు అర్ధరాత్రి వెళ్లి దౌర్జన్యం చేయాల్సిన అవసరమేంటో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు పూర్తిగా ఆదుకున్న తర్వాత ప్రాజెక్ట్ పనులు ప్రారంభించాలని, అప్పటి వరకు బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. బాధితుల పక్షాన బీజేపీ పోరాడుతుందని ప్రకటించారు.

సిద్దిపేట జిల్లాలో అక్కన్న పేట మండలం గుడాటిపల్లిలో నిన్న అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్‌రన్‌ను భూ నిర్వాసితులు అడ్డుకుంటామని ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా నిర్వాసితులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా.. ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. పోలీసుల లాఠీచార్జ్‌లో పలువురు గాయపడ్డారు. దీంతో ఉద్రిక్తత తలెత్తగా పోలీసులు 100 మందిని అరెస్టు చేశారు.

మరోసారి టెన్షన్.. టెన్షన్
ఈ క్రమంలోనే నిర్వాసితులు ఉదయాన్నే పాదయాత్రగా కదలడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు- ప్రొక్లెయినర్లు అడ్డుపెట్టారు. దీంతో పోలీసులు, భూనిర్వాసితులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో లాఠీ చార్జ్‌ చేసి నిర్వాసితుల్ని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు లాఠీ దెబ్బలను సైతం తట్టుకోని హుస్నాబాద్ ఆర్డీవో ఆఫీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో నిర్వాసితుల్ని ఎక్కడికక్కడ అడ్డుకోని అరెస్ట్ చేస్తున్నారు. హుస్నాబాద్ టౌన్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గౌరవెల్లి భూనిర్వాహితుల ర్యాలీని అడ్డుకోవటంపై ప్రతిపక్షాల నేతలు మండిపడుతున్నారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.