యాప్నగరం

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్టు.. స్టేషన్‌కు తరలింపు

Dubbaka MLA: రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రైతు మల్లారెడ్డి ఆత్మహుతికి పాల్పడడం విచారకరమని అన్నారు. ఘటనాస్థలికి వెళ్లి వారిని పరామర్శించేందుకు ప్రయత్నిస్తే తనను అరెస్ట్ చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.

Samayam Telugu 18 Jun 2021, 7:22 pm

ప్రధానాంశాలు:

  • బీజేపీ ఎమ్మెల్యే అరెస్టు
  • పరామర్శకు వెళ్తుండగా..
  • అడ్డుకొని స్టేషన్‌కు తరలింపు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu రఘునందన్ రావు అరెస్టు
raghunandan rao arrest
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌‌ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. మల్లన్న సాగర్ ముంపు బాధితుడు మల్లారెడ్డి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇది స్థానికంగా పెద్ద చర్చనీయాంశం అయింది. దీంతో ఆయన మరణం ప్రభుత్వ హత్యేనని విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఈ ఘటన గురించి తెలుసుకున్న బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బయలుదేరారు. దీంతో పోలీసులు ఆయన్ను అడ్డగించి తుక్కాపూర్ వద్ద అరెస్ట్ చేశారు. అనంతరం రాయపోల్ మండలంలోని బేగంపేట పోలీస్ స్టేషన్‌కు రఘునందన్ రావును తరలించారు.
ఈ సందర్భంగా రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రైతు మల్లారెడ్డి ఆత్మహుతికి పాల్పడడం విచారకరమని అన్నారు. ఘటనాస్థలికి వెళ్లి వారిని పరామర్శించేందుకు ప్రయత్నిస్తే తనను అరెస్ట్ చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. మసిపూసి మారెడుకాయ చేసే పనిలో అధికారులు ఉన్నారని.. సభ్యసమాజం తల దించుకునే విధంగా కేసీఆర్ పాలన ఉందని రఘునందన్‌రావు విమర్శలు చేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో మాట్లాడితే ఎందుకు అరెస్టులు చేస్తున్నారో అర్థం కావట్లేదని రఘునందన్‌ మండిపడ్డారు.

తొగుట మండలంలోని వేములఘాట్‌ గ్రామానికి చెందిన మల్లారెడ్డి(70) భార్య గతంలోనే చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు. అప్పుడప్పుడు మనవడు వచ్చి పలకరించి వెళ్తుండేవాడు. ఇటీవల మల్లన్నసాగర్ ప్రాజెక్టులో మల్లారెడ్డి ఇల్లు ముంపునకు గురైంది. ప్రాజెక్టు నిర్వాసితుల ప్యాకేజీ కింద డబుల్ బెడ్‌ రూం ఇంటికి దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు ఆయనకు ఇల్లు మంజూరు చేశారు.. కానీ ఒంటరి వ్యక్తి అని తెలియడంతో వెనక్కు తీసేసుకున్నారు.

అధికారులు ఇల్లు ఖాళీ చేయించడంతో మల్లారెడ్డి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. చివరి రోజుల్లో గూడు చెదిరిపోవడంతో దిక్కుతోచని స్థితిలో దారుణ నిర్ణయం తీసుకున్నాడు. తన చితి తానే పేర్చుకుని అగ్నికి ఆహుతయ్యాడు. మంటల్లో కాలి బూడిదైపోయాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.