యాప్నగరం

సిద్దిపేట జిల్లాలో అర్ధరాత్రి లాఠీచార్జ్.. 100 మంది భూనిర్వాసితుల అరెస్టు.. రేవంత్ ఆగ్రహం

Siddipet సిద్దిపేట జిల్లాలోని అక్కన్న పేట మండలం గుడాటిపల్లిలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్‌రన్‌ను భూ నిర్వాసితులు అడ్డుకుంటామని ప్రకటించిన నేపథ్యంలో ముందస్తుగా నిర్వాసితులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా తోపులాట చోటుచేసుకొని లాఠీ చార్జ్‌కు దారితీసింది.

Authored byRaj Kumar | Samayam Telugu 13 Jun 2022, 11:08 am
గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితుల అరెస్ట్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. భూ నిర్వాసితులను అరెస్టును ఖండిస్తూ ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. ‘నీళ్లు పారాల్సిన ప్రాజెక్టుల్లో నిర్వాసితుల కన్నీళ్లు పారుతున్నాయి. బీళ్లు తడపాల్సిన ప్రాజెక్టులు నిర్వాసితుల రక్తంతో తడుస్తున్నాయి. సిద్దిపేట జిల్లా గౌరవెల్లి-గండిపెల్లి నిర్వాసితులపై అర్ధరాత్రి పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. వారికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ అండగా ఉంటుంది’ అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ ద్వారా ప్రకటించారు.
Samayam Telugu Gudatipally villagers protest


అసలేమైందంటే?
సిద్దిపేట జిల్లాలో అక్కన్న పేట మండలం గుడాటిపల్లిలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్‌రన్‌ను భూ నిర్వాసితులు అడ్డుకుంటామని ప్రకటించారు. దీంతో పోలీసులు ముందస్తుగా నిర్వాసితులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులకు భూ నిర్వాసితులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు లాఠీచార్జ్‌ నిర్వహించారు. పోలీసుల లాఠీచార్జ్‌లో పలువురు గాయపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్తంగా మారడంతో వంద మంది భూ నిర్వాసితులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. మీడియాను గ్రామంలోకి అనుమతించటం లేదు.

తుది దశకు చేరిన గౌరవెల్లి ప్రాజెక్టు..

హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన గౌరవెల్లి ప్రాజెక్టు చివరి దశకు చేరుకుంది. ప్రాజెక్టు సామర్థ్యం 1.43 టీఎంసీల నుంచి 8.23 టీఎంసీలకు ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు ద్వారా హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని 1.60 లక్షల ఎకరాలకు నీరు అందించాలని సర్కార్ నిర్ణయించింది. కాగా, దాదాపు 95% వరకు ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే పంప్‌హౌస్‌ పూర్తి కావడంతో అధికారులు ట్రయల్ రన్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో భూనిర్వాసితులు ఆందోళనలు చేస్తున్నారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.