యాప్నగరం

డీజిల్ బాటిల్‌తో తహసీల్దార్ కార్యాలయానికి మహిళ.. కలకలం

తహసీల్దార్ లంచం తీసుకుని తమ భూమిని మరొకరికి ఆన్‌లైన్ చేశారని మహిళా రైతు వాపోయింది. డీజిల్ బాటిల్‌తో ఎమ్మార్వో ఆఫీసుకి వచ్చి ఆత్మహత్యాయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Samayam Telugu 1 Sep 2021, 8:16 pm
తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన ఓ మహిళా రైతు ఏకంగా ఆఫీస్‌లోనే అఘాయిత్యానికి ఒడిగట్టింది. డీజిల్ బాటిల్‌తో వచ్చిన ఆమె ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో తీవ్ర కలకలం రేగింది. ఎమ్మార్వో లంచం తీసుకుని తమ భూమిని వేరే వారికి కట్టబెట్టారని ఆరోపిస్తూ డీజిల్ పోసుకుని నిప్పటించుకునేందుకు యత్నించింది. తహసీల్దార్ కార్యాలయానికి కూడా నిప్పు పెట్టేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. ఈ షాకింగ్ ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక తహసీల్దార్ కార్యాలయంలో జరిగింది.
Samayam Telugu ఆగ్రహం వ్యక్తం చేస్తున్న లక్ష్మి
kondapaka


కొండపాక మండలం దమ్మక్కపల్లి గ్రామానికి చెందిన తోకల లక్ష్మి, యాదయ్య దంపతులకు గ్రామంలో 22 గుంటల భూమి ఉంది. తహసీల్దార్ లంచం తీసుకుని ఆ భూమిని వేరొకరికి బదిలీ చేశారని.. మరొకరి పేరు మీద ఆన్‌లైన్ చేశారని బాధితురాలు లక్ష్మి ఆరోపిస్తోంది. భూమికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని.. అయినా తమకు న్యాయం జరగడం లేదని వాపోయింది. పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగినా కోర్టుకి వెళ్లమంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగి విసిగిపోయిన లక్ష్మి దారుణ నిర్ణయం తీసుకుంది. డీజిల్ బాటిల్‌తో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చింది. ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో కార్యాలయంలో అలజడి రేగింది. కార్యాలయంలోనూ డీజిల్ పోసి నిప్పంటించుకునేందుకు ప్రయత్నించింది. ఆఫీస్‌కి వచ్చిన జనం వెంటనే అప్రమత్తమై ఆమెను నిలువరించారు. నిప్పటించుకోకుండా అడ్డుకున్నారు. మహిళ ఆత్మహత్యాయత్నం చేయడంతో తహసీల్దార్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. భూ వివాదముంటే కోర్టుకి వెళ్లాలని.. ఇక్కడ గొడవ చేయడం సరికాదని తహసీల్దార్ పంపించి వేసినట్లు తెలుస్తోంది. మహిళ ఆత్మహత్యాయత్నంతో కొద్దిసేపు హైటెన్షన్ నెలకొంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.