యాప్నగరం

మరో కేక్ తెస్తా కట్ చేసుకోండి.. కొండా బర్త్‌డే వేడుకల్లో ఘర్షణ

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పుట్టినరోజు సందర్భంగా నాయకులతో వేడుకలకు ఏర్పాట్లు చేశారు. కేక్ తీసుకొచ్చి కట్ చేయాలనుకున్నారు. అయితే పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ రమేష్ ఎవరూ రాకముందే కేక్ కట్ చేయడంతో గొడవ చోటు చేసుకుంది.

Samayam Telugu 27 Feb 2021, 1:35 pm
కాంగ్రెస్ నేతల్లో మరోసారి వర్గ విబేధాలు బయటపడ్డాయి. మాజీ ఎంపీ బర్త్‌డే సందర్భంగా నాయకుల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటు చేసుకుంది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా కాంగ్రెస్‌ నేతల మధ్య శుక్రవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. కొండా జన్మదినాన్ని పురస్కరించుకుని తాండూరులోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమక్షంలో కేక్‌ కట్‌ చేయాలని నాయకులు ముందుగా భావించారు.
Samayam Telugu మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి


అయితే కేక్ కటింగ్ కార్యక్రమానికి కార్యకర్తలు, నేతలు అందరూ రాకముందే పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రమేష్‌ మహరాజ్‌ కేక్‌ కట్‌ చేశారు. దీంతో ఆగ్రహించిన పార్టీ నేత ఖయ్యూం తీవ్ర అసహనానికి లోనయ్యారు. రమేష్‌ మహరాజ్‌తో వాగ్వాదానికి దిగారు. కార్యకర్తలందరి సమక్షంలో వేడుకలు నిర్వహిస్తే బాగుండేదన్నారు. కొందరి సమక్షంలో తూతూ మంత్రంగా మాజీ ఎంపీ బర్త్‌డే వేడుకలు జరపడం సరికాదన్నారు.

ఖయ్యూం వ్యాఖ్యలపై రమేష్ స్పందిస్తూ... తాను అత్యవసర పనిమీద వెళ్లాల్సి ఉందన్నారు. అందుకే త్వరగా కేక్ కట్ చేశానని తెలిపారు. మరో పెద్ద కేకు తీసుకొస్తారని, దానిని కట్‌ చేసి వేడుకలు నిర్వహించుకోవాలని రమేష్‌ మహరాజ్‌ చెప్పడంతో వాగ్వాదం మరింత ముదిరింది. ఎవరికి వారే నిర్ణయాలు తీసుకోవడంతో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని పలువురు నేతలు అసహనం వ్యక్తం చేశారు. దీంతో రమేష్‌ మహరాజ్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం మరో కేక్‌ తీసుకొచ్చి వేడుకలు నిర్వహించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.