పెళ్లింట ఊహించని విషాదం నెలకొంది. అంగరంగ వైభవంగా కన్న కూతురు పెళ్లి చేసిన ఓ తండ్రి అదే వేడుకలో కన్నుమూశాడు. దీంతో పెళ్లి పందిట్లోనే రోదనలు మిన్నంటాయి. కాళ్లు కడిగి కన్యాదానం చేసిన వధువు తండ్రి.. కూతురికి అల్లుడు అరుంధతి నక్షత్రం చూపెట్టేలోపే తనువు చాలించాడు.. ఈ విషాద ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. వేణురావుకాలనీకి చెందిన బొరిగం వెంకటరామ్ నర్సయ్య-కళావతి దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో చిన్న కూతురు పెళ్లి శనివారం జరిగింది. కాశీబుగ్గలోని పద్మశాలీ కల్యాణ మండపంలో తన కూతురు హారిక పెళ్లి వేడుక నిర్వహించాడు వెంకటరామ్ నర్సయ్య. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురి వివాహాన్ని బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిపించాడు. ఈ క్రమంలోనే కూతురు పెళ్లయిన కొద్దీ నిమిషాల వ్యవధిలోనే ఆయన తనువు చాలించాడు. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో పక్కకు వచ్చి కూర్చున్న వెంకటరామ్ నర్సయ్య కొద్దిసేపటికే కుప్పకూలి మరణించాడు.
ఓ వైపు అతిథులంతా వధూవరులను ఆశీర్వదిస్తుంటే.. మరోవైపు ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. దీంతో బంధుమిత్రులంతా శోక సంద్రంలో మునిగిపోయారు. భాజాభజంత్రీలు మూగబోయాయి. తన పెళ్లి చేసిన కాసేపటికే తండ్రి కన్ను మూయడంతో వధువు గుండెలవిసేలా రోదించింది. ఈ క్రమంలోనే రాత్రి అంత్యక్రియలు నిర్వహించారు.
ఓ వైపు అతిథులంతా వధూవరులను ఆశీర్వదిస్తుంటే.. మరోవైపు ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. దీంతో బంధుమిత్రులంతా శోక సంద్రంలో మునిగిపోయారు. భాజాభజంత్రీలు మూగబోయాయి. తన పెళ్లి చేసిన కాసేపటికే తండ్రి కన్ను మూయడంతో వధువు గుండెలవిసేలా రోదించింది. ఈ క్రమంలోనే రాత్రి అంత్యక్రియలు నిర్వహించారు.