యాప్నగరం

Medaram: మేడారం జాతరకు వేళాయే.. 2024 తేదీలను ఖరారు చేసిన పూజారులు

Medaram: ఆసియా ఖండంలో జరిగే అతి పెద్ద ఆదివాసి మహా సమ్మేళనం సమ్మక్క -సారలమ్మ జాతర. దట్టమైన అటవీ ప్రాంతంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు.. కోటి మందికి పైగానే భక్తులు వస్తారు. 1996లో ఈ జాతరను అప్పటి ప్రభుత్వం రాష్ట్ర పండగగా ప్రకటించగా.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మేడారం జాతర కు ప్రపంచ ప్రఖ్యాతి లభించింది. తాజాగా.. మేడారం జాతర- 2024 తేదీలను పూజారులు ఖరారు చేశారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 3 May 2023, 10:21 pm

ప్రధానాంశాలు:

  • మేడారం జాతర- 2024 తేదీలు ఖరారు
  • 2024 ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జాతర
  • వివరాలు వెల్లడించిన గిరిజన పూజారులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Medaram Jatar
మేడారం జాతర
Medaram: విలక్షణమైన జీవన విధానం ఉన్న ఆదివాసీలు.. ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలతో జీవిస్తారు. ప్రకృతితో మమేకమైన ఈ గిరిజనులు ప్రధానంగా ఆరాధించే దేవతలు మేడారం సమ్మక్క- సారలమ్మ. ప్రతి రెండేళ్లకోసారి మాఘ పౌర్ణమికి ముందు నాలుగురోజుల పాటు ఈ మహా జాతర జరుగుతుంది. తాజాగా.. మేడారం జాతర- 2024 తేదీలను గిరిజన పూజారులు ఖరారు చేశారు. 2024 ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర (Sammakka Saralamma Jatara) నిర్వహిస్తామని వెల్లడించారు.
ఫిబ్రవరి 21న బుధవారం.. కన్నేపల్లి నుంచి సారలమ్మను గద్దెపైకి తీసుకురానున్నారు. అదే రోజు పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును, కొండాయి గ్రామం నుంచి గోవిందరాజును మేడారం గద్దలపైకి పూజారులు తీసుకొస్తారు. 22న గురువారం.. చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని తీసుకొచ్చి.. గద్దెపై ప్రతిష్టిస్తారు. 23న శుక్రవారం.. వన దేవతలు గద్దెలపై కొలువుదీరుతారు.
అమ్మవార్లు గద్దెల మీద కొలువుతీరిన రోజు నుంచి కోట్లాది మంది గిరిజనులు, గిరిజనేతరులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి వస్తారు. పసుపు కుంకుమలను, వొడి బియ్యాన్ని, బంగారాన్ని (బెల్లం) సమర్పిస్తారు. కోడి పుంజులు, మేకపోతులను బలి ఇస్తారు. సమ్మక్క గద్దె చేరే సమయంలో కోడిపుంజులను గాలిలో ఎగవేసి ఆరగింపు చేస్తారు. 24న శనివారం.. సమ్మక్క, సారలమ్మ పగిడిద్దరాజు, గోవిందరాజు మళ్లీ వనప్రవేశం చేస్తారు.

మేడారం జాతరకు తెలంగాణ ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. జాతరకు కొన్ని నెలల ముందు నుంచే భక్తులను సౌకర్యాలు కల్పిస్తుంది. ఈ మహా జాతరకు తెలంగాణ, ఏపీ నుంచే కాకుంగా.. ఛత్తీస్‌ఘఢ్, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు.

సమ్మక్క- సారలమ్మ జాతర గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను.. 1940 సంవత్సరం వరకు చిలుకల గుట్టపై కేవలం గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. కానీ 1940 తర్వాత భక్తుల సంఖ్య పెరిగింది. గిరిజనేతరులు కూడా జాతరకు రావడం ప్రారంభించారు. అప్పటినుంచి మేడారంలో జాతర జరుగుతోంది.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.