యాప్నగరం

ఓరుగల్లు.. ఫలించని బీజేపీ ప్రయత్నాలు..? చక్రం తిప్పిన కాంగ్రెస్ నేత!

దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంలో ఉన్న బీజేపీ కన్ను ఓరుగల్లు మీద పడింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొండా దంపతులను లాగేసుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నించింది.

Samayam Telugu 21 Dec 2020, 2:57 pm
తెలంగాణ బీజేపీ జోరు మీదుంది. దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఊహించని రీతిలో సీట్లు గెలవడంతో ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయి. టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తామే గెలుస్తామని కమలనాథులు ధీమాతో ఉన్నారు. ఇందుకు తగ్గట్టుగానే ఆ పార్టీలోకి చేరికలు ఉన్నాయి. ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలను కమలం గూటికి ఆహ్వానిస్తున్నారు.
Samayam Telugu bjp and congress
Picture used for representational purpose only


దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ నేతలు బీజేపీ వైపు చూడటం మొదలుపెట్టారు. పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేయలేకపోవడం.. ఎన్నికల్లో దారుణమైన ఫలితాలతో.. హస్తం పార్టీలోనే ఉంటే తమకు భవిష్యత్తు ఉండేదేమోననే బెంగ కొందరు కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. ఇదే అదనుగా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది.

వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో.. బీజేపీ చూపు వరంగల్ జిల్లాలోని కీలక నేతలపై పడింది. కొండా మురళి, సురేఖ దంపతులను బీజేపీలోకి చేర్చుకునే ప్రయత్నం జరిగినప్పటికీ కుదర్లేదని తెలుస్తోంది. తమ కుమార్తెకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని వారు బీజేపీని కోరుతున్నారన్నట్లుగా వార్తలు సైతం వెలువడ్డాయి.

కొండా దంపతులు పార్టీ మారుతారని జరిగిన ప్రచారాన్ని మురళీ ఖండించారు. తామిద్దరం పార్టీలోనే కొనసాగుతామని తెలిపారు. గతంలో తాము టీఆర్ఎస్‌లోకి వెళ్లడానికి కారణం తనకు టికెట్ ఇవ్వకపోవడమేనన్నారు. టీఆర్ఎస్ దొరల పార్టీ అని, అవసరం కోసం వాడుకున్నారని కొండా మురళి ధ్వజమెత్తారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో తమకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ఏఐసీసీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాకూర్‌ తమతో మాట్లాడిన తర్వాతే కొండా దంపతులు పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.