యాప్నగరం

Anushka Sharma: విరాట్ కోహ్లి సెంచరీ.. అనుష్క శర్మ ఎమోషనల్ పోస్ట్

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat Kohli) ఎట్టకేలకు శతక్కొట్టాడు. ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 బంతుల్లోనే 122 రన్స్ చేసి భారత్‌ను గెలిపించాడు. ఈ సందర్భంగా అనుష్క శర్మ (Anushka Sharma) సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Ashok Krindinti | Samayam Telugu 9 Sep 2022, 8:50 am
ఎన్నో రోజులు క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న కోరిక నెరవేరింది. 1020 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat Kohli) సెంచరీ చేశాడు. గురువారం రాత్రి అఫ్గానిస్థాన్‌ (IND vs AFG) తో జరిగిన మ్యాచ్‌లో 61 బంతుల్లోనే 122 రన్స్ చేసి అభిమానులను అలరించాడు ఈ రన్ మెషిన్. చివరగా 2019 నవంబరులో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ చేయగా.. మళ్లీ ఇన్నాళ్లకు శతకొట్టాడు. వంద మార్కును చేరుకున్న వెంటనే మెడలో నుంచి తన భార్య అనుష్క శర్మ (Anushka Sharma) ఇచ్చిన లాకెట్‌ను తీసి ముద్దు పెట్టుకున్నాడు.
Samayam Telugu anushka sharma on virat kohli
విరాట్ కోహ్లి సెంచరీపై అనుష్క పోస్ట్


విరాట్ కోహ్లి చాలా కాలం తరువాత సెంచరీ చేయడంతో అనుష్క శర్మ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. తన భర్తపై ప్రేమను కురిపిస్తూ.. సెంచరీ మూమెంట్ ఫొటోలను షేర్ చేసుకుంది. 'ప్రతిదీ ఎల్లపుడూ నీతోనే ఉంటుంది..' అంటూ రాసుకొచ్చింది. హార్ట్ సింబల్‌ను యాడ్ చేసింది. అనుష్క పోస్ట్‌పై సినీ ప్రముఖులతో పాటు విరాట్ కోహ్లీ స్పందించాడు. హార్ట్ ఎమోజీలతో అనుష్కకు రిప్లై ఇచ్చారు. రణవీర్ సింగ్ నుంచి శ్రద్ధా కపూర్ వరకు చాలా మంది అనుష్క పోస్ట్‌పై కామెంట్స్ చేశారు. కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

సెంచరీ చేసిన సందర్భంగా విరాట్ మాట్లాడుతూ.. 'నేను ఈ రోజు ఇక్కడ నిలబడి ఉండటం కారణం ఒకే ఒక్క వ్యక్తి. ఆమె అనుష్క. ఈ సెంచరీ అనుష్క, మా ముద్దుల కూతురు వామిక కోసమే. అనుష్క నిత్యం నాకు అండగా నిలబడి ఎంతో సపోర్ట్ చేసింది. .. నన్ను నేను చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. కొద్ది కాలం ఆటకు దూరంగా ఉండడం వల్ల చాలా నేర్చుకున్నాను. మానసికంగా, శారీరకంగా అలసిపోవడంతో కాస్త విశ్రాంతి తీసుకున్నాను. చాలా విరామం తర్వాత సెంచరీ చేసినందుకు సంతోషంగా ఉంది. టీమ్‌కు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనుకున్నాను..' అని చెప్పాడు. తన సెంచరీ క్రెడిట్ మొత్తం భార్య అనుష్కకే ఇచ్చేశాడు కింగ్ కోహ్లి.

2019 నవంబర్‌లో కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన డే నైట్ టెస్టులో బంగ్లాదేశ్‌పై విరాట్ కోహ్లీ చివరి శతకం బాదాడు. అప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ చేసిందుకు 84 ఇన్నింగ్స్‌లు, 1020 రోజుల సమయం పట్టింది ఈ రన్ మెషిన్‌కు. కోహ్లి కెరీర్‌లో ఇది 71వ సెంచరీ. ఈ శతకం కోసమే అభిమానులు ఇన్నాళ్లు ఎదురుచూశారు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘానిస్థాన్‌పై విజయం సాధించిన టీమిండియా.. ఫైనల్ చేరుకోకుండానే ఇంటిముఖం పట్టింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.