యాప్నగరం

Rishi Kapoor Died: బాలీవుడ్‌లో మరో విషాదం.. రిషీ కపూర్ కన్నుమూత

బాలీవుడ్ నటుడు, నిర్మాత, దర్శకుడు రిషి కపూర్ అనారోగ్య సమస్యతో మరణించారు. ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.

Samayam Telugu 30 Apr 2020, 11:24 am
బాలీవుడ్‌లో వరుస మరణాలు చోటు చేసుకోవడం సినీ వర్గాలను షాకింగ్‌కి గురిచేస్తోంది. నిన్న (బుధవారం) ఇర్ఫాన్ ఖాన్ మరణించగా.. కొద్దిసేపటి క్రితం ఈ రోజు (గురువారం) సీనియర్ నటుడు, రాజ్ కపూర్ తనయుడు రిషి కపూర్ (67) మరణించడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయనను గత రాత్రి ముంబైలోని హెచ్ ఎన్ రిలయెన్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు.
Samayam Telugu రిషీ కపూర్ మృతి
Rishi Kapoor


1952 వ సంవత్సరం సెప్టెంబర్ 4న జన్మించిన రిషికపూర్.. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా రాణించారు. 1980లో హీరోయిన్ నీతూ సింగ్‌ని పెళ్లాడాడు. రిషికపూర్ కుమారుడే ప్రముఖ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్. రిషి కపూర్ మరణ వార్త తెలిసి బాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ అయింది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బీ అమితాబ్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

'మేరా నామ్ జోకర్' సినిమాతో బాలనటుడిగా తెరంగేట్రం చేశారు రిషి కపూర్. 1974 లో ఆయన నటించిన 'బాబీ' సినిమాకు గాను ఫిలిం ఫేర్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఇటీవల ముల్క్ అనే సినిమాలో నటించి మరోసారి అదరగొట్టారు. రీసెంట్ గా ది బాడీ అనే సినిమాలో, ఓ వెబ్ సిరీస్ లో కూడా నటించారు రిషి కపూర్.

2018లోనే రిషి కపూర్‌కు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయన న్యూయార్క్‌ నగరంలో చికిత్స తీసుకొని ఇండియా వచ్చారు. ఇటీవలే ఆయన యోగా చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది రిషి భార్య నీతూ సింగ్. ఇంతలోనే ఆయన మరణించారనే వార్త బాలీవుడ్ ఇండస్ట్రీని శోక సంద్రంలో నెట్టేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.