యాప్నగరం

YS Jagan స్వీటెస్ట్, హాటెస్ట్.. ఆయనకు ఇంత మచ్చ కూడా తేను: పోసాని కృష్ణమురళి

ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నటుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్‌పై (YS Jagan) ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ స్వీటెస్ట్ అని.. హాటెస్ట్ అని.. నథింగ్ బట్ ఎవరెస్ట్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు.

Authored byవరప్రసాద్ మాకిరెడ్డి | Samayam Telugu 3 Feb 2023, 5:01 pm
తెలుగు సినీ పరిశ్రమకు ఎంత మేలు చేస్తానో తెలీదు కానీ.. కీడు మాత్రం చేయనని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APFDC) నూతన చైర్మన్, నటుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) అన్నారు. ఏపీఎఫ్‌డీసీ చైర్మన్‌గా పోసాని కృష్ణమురళి గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఏపీ సినిమాటోగ్రఫీ మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఫైబర్ నెట్ చైర్మన్ గౌతంరెడ్డి, లక్ష్మీపార్వతి, నిర్మాతలు సి.కళ్యాణ్, అంబికా కృష్ణ సమక్షంలో విజయవాడలోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు.
Samayam Telugu Posani Krishna Murali
సీఎం జగన్‌తో పోసాని కృష్ణమురళి


ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. ‘‘జగన్‌మోహన్ రెడ్డి నాకు ఈ పదవి ఇస్తారని నేను రాజకీయాల్లోకి రాలేదు. నాకు 11 ఏళ్ల నుంచి జగన్‌మోహన్ రెడ్డి తెలుసు. మొన్నటి వరకు కూడా ఏరోజూ ఆయన్ని నేను కలవలేదు. ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేవాడిని. నన్ను పిలుస్తూ ఉండేవారు. నేను వస్తానన్న అని చెప్పేవాడిని.. ఎగ్గొట్టేవాడిని. దూరంగా చూస్తూ ఇష్టపడేవాడిని. ఎందుకంటే.. చాలా మంది కులాల్లో నుంచి, మతాలలో నుంచి, డబ్బుల్లో నుంచి నాయకులు పుడతా ఉంటారు. కులాల్లో నుంచి, కలల్లో నుంచి పుట్టిన నాయకుడు కాదు జగన్ మోహన్ రెడ్డి. జనాల్లో నుంచి పుట్టిన నాయకుడు. అందుకే ఆయనంటే నాకు బాగా ఇష్టం’’ అని చెప్పుకొచ్చారు.

ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని తాను చూశానని.. అందుకే ఆయనతో స్నేహం చేశానని పోసాని వెల్లడించారు. ‘‘జగన్‌మోహన్ రెడ్డి ఈజ్ స్వీటెస్ట్.. హీ ఈజ్ ఏ హాటెస్ట్.. హీ ఈజ్ హానెస్ట్.. హీ ఈజ్ గ్రేటెస్ట్.. నథింగ్ బట్ ఎవరెస్ట్. అలాంటి వాడు కాబట్టి.. నేను ఈరోజు ఈ పదవి అన్న చేతుల దగ్గర నుంచి నేను తీసుకున్నాను. నేను సినిమా ఇండస్ట్రీకి ఎంత మంచి చేస్తానో నాకు తెలీదు కానీ.. చెడు మాత్రం చేయను. మోసాలు చేయను. అబద్ధాలు చెప్పను. మా కళ్యాణ్ అన్నకి, అంబికా కృష్ణ అన్నకి, రాంప్రసాద్ అన్నకి వీళ్లందరికీ నేను ఆకాశం నుంచి చుక్కలు చూపిస్తానని చెప్పను. నేను మనసులో ఎంత అనుకున్నానో అంత నా చేతికి ఇస్తారు జగన్‌మోహన్ రెడ్డి. ఆ నమ్మకం నాకు ఉంది. గ్యారంటీగా నేను సేవ చేస్తాను. సంతోషంగా నేను మీ దగ్గర ఉంటాను. జగన్‌మోహన్ రెడ్డికి ఇంత కూడా మచ్చ తేను. ఇప్పటి నుంచి నేను చచ్చిపోయేంత వరకు జగన్, జగన్ జెండా, వైసీపీ తప్ప నాకు ఇంకోటి లేదు’’ అని పోసాని తెలియజేశారు.

గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన పోసాని కృష్ణమురళి.. సినిమా ఇండస్ట్రీలోకి డైలాగ్ రైటర్‌గా అడుగుపెట్టారు. పరుచూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్ రైటర్‌గా పనిచేసిన పోసాని.. ‘గాయం’ సినిమాకు తొలిసారి మాటలు రాశారు. ఆ తరవాత చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు కథ, మాటలు అందించారు. ‘ఆపరేషన్ దుర్యోధన’ సినిమాతో డైరెక్టర్‌గా హిట్ అందుకున్నారు. ఒకవైపు రైటర్‌గా కొనసాగుతూనే నటనవైపు కూడా అడుగులు వేశారు. కమెడియన్‌గా, కామెడీ విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇక ఆయన రాజకీయ ప్రయాణం చూసుకుంటే.. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో పోసాని చేరారు. ఆ పార్టీ తరుఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరవాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ పాదయాత్ర చేసినప్పటి నుంచీ ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. పోసాని సేవలను గుర్తించిన వైఎస్ జగన్.. ఆయనకి ఎట్టకేలకు పదవి కట్టబెట్టారు.
రచయిత గురించి
వరప్రసాద్ మాకిరెడ్డి
వరప్రసాద్ మాకిరెడ్డి సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో టెక్నాలజీ, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.