Actress Hema And Her Daughter Donates Blood To Chiranjeevi Blood Bank
చాలా రక్తం పోయింది.. బతుకుతానని అనుకోలేదు: చిరంజీవికి థ్యాంక్స్ చెప్పిన హేమ
కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ను అమలు చేస్తున్నారు. అయితే, ఈ లాక్డౌన్ వల్ల బ్లడ్ బ్యాంక్లలో రక్తం కొరత ఏర్పడుతోంది. దీనికి కారణం రక్తదాతలు లేకపోవడం.
Samayam Telugu22 Apr 2020, 1:34 pm
సకాలంలో రక్తం అందుబాటులో లేకపోతే ఒక మనిషిని మనం బతికించుకోలేం. రక్తమనేది మనిషికి సంజీవని వంటిది. అందుకే, అత్యవసర సమయంలో రక్తాన్ని అందించడానికి బ్లడ్ బ్యాంకులు నిర్వహిస్తున్నారు. దాతలు ఇచ్చిన రక్తాన్ని ఈ బ్లడ్ బ్యాంకుల్లో భద్రపరుస్తున్నారు. అయితే, ప్రస్తుతం లాక్డౌన్ వల్ల రక్తదాతలు కరువయ్యారు. దీంతో బ్లడ్ బ్యాంకుల్లో రక్తం కొరత ఏర్పడింది. హాస్పటల్స్లో ప్రాణాపాయంలో ఉన్నవారికి సకాలంలో రక్తం అందించలేని పరిస్థితి. అందుకే, ఈ లాక్డౌన్ సమయంలో రక్తదాతలు ముందుకు రావాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. తాను స్థాపించిన చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు వెళ్లి ఇటీవల రక్తదానం చేశారు. శ్రీకాంత్ సహా మరికొంత మంది నటులు కూడా చిరంజీవితో పాటు వెళ్లి రక్తం దానం చేశారు. తాజాగా నటి హేమ తన కుమార్తె కలిసి చిరంజీవి బ్లడ్ బ్యాంక్కు వెళ్లి రక్తం ఇచ్చారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఒక వీడియో మెసేజ్ను విడుదల చేశారు.
స్త్రీకి ప్రసవం అంటే పునర్జన్మ..
ప్రస్తుత లాక్డౌన్ సమయంలో రక్తం అందుబాటులో లేకపోవడంతో గర్భిణీలు ఇబ్బంది పడుతున్నారని డాక్టర్లు చెబుతున్నట్టు నటి హేమ వెల్లడించారు. దయచేసి రక్తదాతలు ముందుకురావాలని ఆమె పిలుపునిచ్చారు. ‘‘ప్రసవ సమయంలో గర్భిణీల నుంచి చాలా రక్తం పోతుంది. ఈ విషయం ఆడవాళ్లకు తెలుసు, మగవాళ్లకు తెలుసు.. ఆడవాళ్లకు ఇంకా బాగా తెలుసు. స్త్రీకి ప్రసవం అంటే పునర్జన్మ అని అంటారు. అంటే ఎంత ప్రమాదంలో, ఎంత నెప్పులతో ఒక తల్లి తన బిడ్డకు జన్మనిస్తుందో మనందరికీ తెలిసిన విషయమే’’ అని హేమ వీడియోలో చెప్పుకొచ్చారు.
నేను, నా కూతురు రక్తం దానం చేశాం..
ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా రక్తం దొరకడం లేదని డాక్టర్లు చెబుతున్న విషయాన్ని హేమ గర్తుచేశారు. అందుకే, తన వంతు బాధ్యతగా మంగళవారం తన కూతురితో కలిసి చిరంజీవి బ్లడ్ బ్యాంక్కు వెళ్లి రక్తదానం చేశామని హేమ చెప్పారు. అలాగే, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే, చిరంజీవి బ్లడ్ బ్యాంక్తో తనకు ఉన్న సంబంధాన్ని ఈ సందర్భంగా హేమ గుర్తుచేసుకున్నారు. తన డెలివరీ సమయంలో చాలా సీరియస్ అయ్యిందని, అప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి తనకు రక్తం అందిందని హేహ చెప్పారు.
16 ఏళ్ల క్రితం..
‘‘16 ఏళ్ల క్రితం నా ప్రసవ సమయంలో నాకు చాలా సీరియస్ అయ్యింది. నాది ఓ నెగిటివ్ బ్లడ్. అర్ధరాత్రి 12 గంటల నుంచి 1.30 గంటల వరకు రక్తం కోసం మేం తిరగని బ్లడ్ బ్యాంక్ లేదు. కానీ, ఎక్కడా రక్తం దొరకలేదు. అప్పుడు రాజా రవీంద్రకు ఫోన్ చేస్తే.. చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ వెళ్లి నా కోసం రక్తం తీసుకువచ్చారు. ఓ నెగిటివ్ బ్లడ్ చాలా అరుదుగా దొరుకుతుంది. దీంతో ఎవరెవరినో పట్టుకుని చాలా కష్టపడి రక్తం సంపాదించారు. అది చాలా క్రిటికల్ సిట్యువేషన్’’ అని హేమ చెప్పుకొచ్చారు.
నేను పోతానేమో అనుకున్నారు..
‘‘నాకు ప్రసవ సమయంలో స్ట్రిచెస్ ఓపెన్ అయిపోయాయి. చాలా రక్తం పోయింది. 6 శాతానికి రక్తం పడిపోయింది. ఆ అర్ధరాత్రి సమయంలో రక్తం దొరికి ఉండకపోతే నా కూతురు ముద్దు ముచ్చట్లు ఇప్పుడు నేను చూసుకుని ఉండలేకపోయేదాన్నేమో. ఇప్పుడు మీ ముందు నేను నవ్వుతూ మాట్లాడుతున్నాను.. కానీ, అప్పుడు నేను పోతానేమో అని భయభ్రాంతులతో నా ఫ్యామిలీ ఉంది. అలాంటి సమయంలో చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ నుంచి నాకు రక్తం అందించి నన్ను కాపాడారు. నాలానే చాలా మంది గర్భిణీలు ఈ లాక్డౌన్ సమయంలో రక్తం దొరకక ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్నాను. అందుకే, నా కూతురితో కలిసి రక్తదానం చేయడానికి వచ్చాను. థాంక్యూ చిరంజీవిగారు. దేవుడు మీకు ఆయురారోగ్యాలు మీకు ప్రసాదించాలని, ఇలాగే మీరు ఎన్నో గొప్ప పనులు చేయాలని, మాకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని హేమ తెలిపారు.
Video-చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వల్లే నేను బతికాను: హేమ
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.