యాప్నగరం

అల్లువారి ‘రామాయణం’.. అనుమానాలెన్నో!

మన పౌరణిక, జానపద కథలకి విజువల్ ఎఫెక్ట్స్ జోడించి, ఆసక్తికరంగా తెరకెక్కిస్తే బాక్సాఫీసు రికార్డులు బద్దలయిపోతాయని ‘బాహుబలి’ నిరూపించింది.

TNN 11 May 2017, 4:10 pm
మన పౌరణిక, జానపద కథలకి విజువల్ ఎఫెక్ట్స్ జోడించి, ఆసక్తికరంగా తెరకెక్కిస్తే బాక్సాఫీసు రికార్డులు బద్దలయిపోతాయని ‘బాహుబలి’ నిరూపించింది. దీన్ని ఆదర్శంగా తీసుకుని రామాయణ మహాకావ్యాన్ని తెరకెక్కించనున్నట్లు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ బుధవారం వెల్లడించారు. మరో ఇద్దరు నిర్మాతలు మధు మంతెన, నమిత్‌ మల్హోత్రాతో కలసి రామాయణాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారు.
Samayam Telugu allu arvind will prouduce 3d ramayanam is it possible
అల్లువారి ‘రామాయణం’.. అనుమానాలెన్నో!


రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ త్రీడీ రామాయణాన్ని నిర్మిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్టు అసలు పట్టాలెక్కుతుందా అనే అనుమానాన్ని కొంతమంది సినీవిశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టును తెరకెక్కించగల స్టామినా అల్లు అరవింద్‌కు ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అల్లు అరవింద్ ఏనాడు హీరోని, డైరెక్టర్‌ పేరుని బయటపెట్టకుండా తన ప్రాజెక్టులను వెల్లడించలేదు. ఇప్పుడు తొలిసారి ఈ వివరాలేమీ లేకుండా ‘రామాయణం’ ప్రాజెక్టు గురించి వెల్లడించారు. ఇప్పుడిదే అనుమానాలకు తావిస్తోంది.

మరోవైపు మరో నిర్మాతగా వ్యవహరించనున్న మధు మంతెన.. రాంగోపాల్ వర్మకు దగ్గర బంధువు. ఆమిర్ ‌ఖాన్‌తో అరవింద్ నిర్మించిన హిందీ సినిమా ‘గజిని’కి మధు మంతెన పనిచేశారు. అయితే మధు చాలా తెలుగు, తమిళ సినిమాలను బాలీవుడ్‌లో రీమేక్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా సెట్స్ మీదికి వెళ్లలేదు. మరి వీరి కాంబినేషన్‌లో ఇంత పెద్ద ప్రాజెక్టు పట్టాలెక్కుతుందా? అని అనుమాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. కానీ బుధవారం అల్లు అరవింద్ ప్రకటన చూస్తే మాత్రం ఈ మహాకావ్యాన్ని కచ్చితంగా నిర్మించేలానే కనిపిస్తున్నారు.

‘అద్భుమైన నటీనటులు, టెక్నికల్ టీంతో అంతర్జాతీయ స్థాయిలో రామయాణాన్ని తెరకెక్కిస్తాం. మాకు ఇదో పెద్ద బాధ్యత’ అని అరవింద్ అన్నారు. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్‌ను కూడా విడుదల చేశారు. దీనిలో నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు లేనప్పటికీ.. సినిమా నవంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. నటీనటులు, టెక్నీషియన్ల ఎంపిక త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు. మరి ఈ త్రీడీ రామాయణంలో రాముడెవరు.. సీతమ్మ ఎవరు.. రావణాసురుడు ఎవరు.. తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.