యాప్నగరం

Pawan Kalyan: పవన్ ఓడిన చోటే ‘జనసేన’ను గెలిపిస్తా.. భీమవరంలో వైసీపీని ఓడిస్తా: ‘కామెడీ’యన్ పృథ్వీ

Prudhvi Raj: భీమవరంలో హిస్టరీ రిపీట్ అంటే.. అక్కడ గత ఎన్నికల్లో గెలిచింది వైసీపీ.. వచ్చే ఎన్నికల్లోనూ హిస్టరీ రిపీట్ అంటే మళ్లీ ఆపార్టీనే గెలవడం. కానీ కమెడియన్ పృథ్వీ హిస్టరీ రిపీట్ అంటూ తనదైన శైలిలో కామెడీ పంచ్‌లు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్నానని అంటున్నారు పృథ్వీ.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 30 Jun 2022, 3:19 pm
ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందంట.. కమెడియన్ పృథ్వీ మాటలు చూస్తే ఇలాగే ఉంది. పవన్ కళ్యాణ్‌కే సాధ్యం కానిది ఇతను చేసి చూపిస్తాడట.. అది కూడా నిన్నటి వరకూ ఏ పార్టీ పంచనచేరి పవన్ కళ్యాణ్‌ని బండబూతులు తిట్టాడో.. తిరిగి అదే పార్టీని మట్టికరిపిస్తానంటూ శపథాలు చేస్తున్నాడు ఈ కమెడియన్.
Samayam Telugu comedian prudhvi
కమెడియన్ పృథ్వీ


వైసీపీ పార్టీలో కీలకనేతగా.. సీఎం జగన్‌పై వీర విధేయత ప్రదర్శిస్తూ.. టీడీపీ, జనసేన నాయకుల్ని నోటికొచ్చినట్టు తిడుతూ హాట్ టాపిక్ అయ్యారు పృథ్వీ. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ని, చిరంజీవిని నోటికొచ్చినట్టు తిడుతూ స్థాయి మరచి ప్రవర్తించారు పృథ్వీ. మొత్తానికి ఎలాగైతే ఇతని కష్టాన్ని గుర్తించిన వైసీపీ ప్రభుత్వం.. ఎస్వీబీసీ చైర్మన్‌ని చేసింది. అయితే అక్కడికి వెళ్లిన తరువాత ఓ మహిళా ఉద్యోగినితో జరిపిన రాసలీలల బాగోతం బెడిసికొట్టింది. వెనుక నుంచి పట్టుకుంటానంటూ ఓ మహిళా ఉద్యోగినితో పృథ్వీ మాట్లాడుతున్నట్టుగా ఉన్న ఆడియో కాల్ బయటకు రావడంతో.. ఈయనగారి పదవి ఊడిపోవడంతో పాటు పార్టీ నుంచి కూడా దూరంపెట్టేశారు. దీంతో కొన్నాళ్ల పాటు సైలెంట్‌గానే మింగలేక కక్కలేక అన్నట్టుగా ఉన్న పృథ్వీ.. ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు.

హార్డ్ కోర్ వైసీపీ నాయకుడిగా ఉన్న పృథ్వీ ఇప్పుడు జనసేన జెండా మోసేందుకు రెడీ అయ్యారు. ఇంకా పవన్ కళ్యాణ్‌‌ని కలవలేదు.. ఆ పార్టీలో చేరలేదు.. జనసైనికులు ఈయన్ని పార్టీలోకి ఆహ్వానించడానికి ఒప్పుకోనూ లేదు.. అప్పుడే జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది.. తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తాడో కూడా చెప్పేస్తున్నాడు. విచిత్రం ఏంటంటే.. పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ఓడిపోయారో.. ఆ భీమవరం నుంచే తాను బీఫామ్ తీసుకుని.. వైసీపీని ఓడిస్తానంటూ శపథాలు చేస్తున్నారు పృథ్వీ.

ఆయన మాట్లాడుతూ.. ‘2019లో చేసిన పొరపాటు 2024లో రిపీట్ కాకూడదు. ఈసారి భీమేశ్వరస్వామి సాక్షిగా అనూహ్యమైన ఫలితం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలిచితీరతారు. ఇది మేం రాసిస్తాం అని ఘంటాపథంగా ప్రజలుచెప్తున్నారు. ఈ ప్రభుత్వం మారాలని ప్రజలు అనుకుంటున్నారంటే.. పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని కోరుకుంటున్నట్టే లెక్క. ఇందులో సందేహం లేదు.

ఈసారి నేను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తా.. బీఫామ్ తీసుకుని నిలబెడతా. ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు దెబ్బ తిన్నారో.. అక్కడే పోటీ చేసి.. హిస్టరీ రిపీట్ అని డైలాగ్ కొడతా. ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది. మేం కేవలం డైలాగ్‌లు మాత్రమే చెప్పడం లేదు.. ఏం జరగబోతుందని గ్రౌండ్ లెవల్‌ నుంచి వర్క్ చేసి మరీ చెప్తున్నాం.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు కేవలం జనసేనకు మాత్రమే కలిసి వస్తుంది. టీడీపీకి అవకాశం ఉండదు. బాల్ మా కోర్టులో ఉంది. ఈసారి వన్ సైడ్‌ లవ్‌లు ఉండవు. ప్రజలు జనసేనవైపు మాత్రమే ఉంటారు’ అని ధీమా వ్యక్తం చేశారు కమెడియన్ పృథ్వీ.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.