Corona Crisis Charity Help Will Continue Till Shooting Restart, Says Chiranjeevi
ఏ ఒక్కరూ పస్తులు ఉండటానికి వీల్లేదు.. జై చిరంజీవ!
ఈ లాక్డౌన్ సమయంలో ఏ ఒక్కరూ పస్తులు ఉండకూడదని మెగాస్టార్ చిరంజీవి అంటున్నారు. మళ్లీ షూటింగ్లు మొదలయ్యే వరకు సినీ కార్మికులకు సీసీసీ ద్వారా నిత్యావసరాలను అందిస్తామని స్పష్టం చేశారు.
Samayam Telugu23 Apr 2020, 6:01 pm
మెగాస్టార్ చిరంజీవి.. ఈపేరు స్క్రీన్పై కనబడగానే ఈలలు వేస్తూ, గోల చేస్తూ, అన్నయ్య అంటూ అరిచే అభిమానులు కోట్లలో ఉన్నారు. అంత మెండుగా, నిండుగా ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్నారు చిరంజీవి. అంతమంది అభిమానులను సంపాదించుకున్న చిరంజీవి తాను ధన్యజీవిని అని ఫీల్ అవుతారు. అంతేకాదు ‘పే బ్యాక్ టు సొసైటీ’ అనే విషయానికి ఆయన చాలా ప్రాధాన్యత ఇస్తారు. దాసరి నారాయణరావు మరణం తరువాత దిశానిర్దేశం చేసే పెద్ద దిక్కు లేక దిక్కు తోచని స్థితిలో ఉన్న తెలుగు సినీ పరిశ్రమకు అన్ని విధాలుగా వెన్ను దన్నుగా ఉండే పెద్దన్న బాధ్యత తీసుకున్నారు చిరంజీవి. సినిమా ఇండస్ట్రీలో జరిగే మంచి చెడులను గమనిస్తూ పెద్దరికంగా సమస్యలను పరిష్కరిస్తూ, మధ్య మధ్యలో సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ‘సైరా’ లాంటి భారీ సినిమా నిర్మించి కొన్ని వందల కుటుంబాలకు పని కల్పించిన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మాణంలోనే తన తదుపరి సినిమా ‘ఆచార్య’లో నటుస్తున్నారు. ప్రస్తుతం లాక్డౌన్ వల్ల షూటింగ్ నిలిచిపోయింది.
వాళ్లను ఆదుకుంటే సరిపోతుంది.. కానీ
ఈ లాక్డౌన్ సమయంలో ‘ఆచార్య’ యూనిట్ని ఆదుకోవడానికి చిరంజీవి గానీ, నిర్మాతలు రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కానీ కాస్త సాయం చేస్తే సరిపోతుంది. కానీ, సాయం అనే సరికి చిరంజీవి గుండె సముద్రమంత విశాలంగా మారుతుంది. అందుకే, తెలుగు సినిమా పరిశ్రమను నమ్ముకుని రోజువారీ వేతనాలతో తమ జీవితం సాగించే 24 క్రాఫ్ట్స్ని ఆదుకోవాలనే అతి పెద్ద ఆలోచన చేశారు. కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) స్థాపించి తన ఆలోచనను ఆచరణలో పెట్టారు.
చిరంజీవిపై ఉన్న నమ్మకం..
చిరంజీవి అలా సీసీసీ స్థాపించిన కొన్ని గంటల్లోనే సినిమా ఇండస్ట్రీలోని అనేక మంది ప్రముఖులు తమ స్థాయి, స్తోమతకు తగ్గట్టుగా ఆర్థిక సహాయం అందించారు. అది చిరంజీవిపై వారికి ఉన్న భరోసా. సీసీసీకి ఇచ్చే ఏ ఒక్క పైసా వృథా కాదు అనే నమ్మకం. అందుకు తగ్గట్టే చిరంజీవి నేతృత్వంలోని సీసీసీ లాక్ డౌన్లో నేరుగా ఇబ్బందుల్లో ఉన్న వారి ఇంటికి వెళ్ళి నిత్యావసరాలు అందించింది.. ఇంకా అందిస్తుంది కూడా. అయితే ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చిరంజీవి ఈ విషయం గురించి మరింత వివరంగా మాట్లాడారు.
ఎన్నాళ్లైనా సాయం అందిస్తాం..
ఏదో ఒక్క నెల సాయం చేసి ఆపెయ్యాలి అనే ఆలోచన తమకు లేదు అని, లాక్ డౌన్ ఉన్నంత కాలం, తిరిగి షూటింగ్స్ మొదలయ్యేవరకు.. అది రెండు నెలలు అయినా, నాలుగు నెలలు అయినా సీసీసీ తరఫున సాయం అందిస్తామని చిరంజీవి స్పష్టం చేశారు. లాక్డౌన్ వల్ల సినిమా ఇండస్ట్రీలోని ఏ ఒక్కరూ పస్తులు ఉండడానికి వీలు లేదు అని చిరంజీవి చెప్పారు. దానికోసం అవసరమయితే ఎవరిముందుకు వెళ్ళి సాయం అడగడానికి అయినా వెనుకాడను అని చెప్పారు. ఇప్పటివరకు ఎవరినీ ఇది కావాలి అని అడగని తాను ఇప్పుడు మాత్రం ఆడుతానని, వాళ్ళు కూడా ముందుకు వచ్చి సాయం చేస్తారు అని జీవీకే, మేఘా లాంటి కొన్ని సంస్థల పేర్లు చెప్పుకొచ్చారు.
అభిమాని ఆపరేషన్ కోసం సాయం..
ఇటీవల గుంటూరుకు చెందిన తన వీరాభిమాని రాజనాల నాగలక్ష్మి ఆరోగ్యం విషమించింది అని తెలుసుకుని ఆమెని హైదరాబాద్ రప్పించి స్టార్ హాస్పిటల్స్లో ఆపరేషన్ చేయించారు. హాస్పిటల్ ఫౌండర్, ప్రముఖ డాక్టర్ అయిన గోపీచంద్ గారితో స్వయంగా మాట్లాడి ఆమె ఆపరేషన్ అన్నివిధాలా సహకరించారు. గుండె ఆపరేషన్ అనంతరం ప్రస్తుతం ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. అయితే ఈ వార్త తెలియగానే తనకు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేను అని, ఇలాంటివన్నీ ఆత్మ సంతృప్తి కోసమే చేస్తాం అని తన సింప్లీసిటీని చాటుకున్నారు చిరంజీవి.
ఆ ఘటనతో నా హృదయం ద్రవించింది..
తాజాగా సోషల్ మీడియాలో తన ఎంట్రీ గురించి కూడా చిరంజీవి ప్రస్తావించారు. నిజానికి దిశా సంఘటన సమయంలో తన హృదయం ద్రవించిపోయిందన్నారు. కానీ, తన భావాలను పంచుకోవడానికి అప్పుడు సరైన వేదిక లేదని ఫీలయ్యానని చెప్పారు. అందుకే ఈ సమయంలో సోషల్ మీడియాలోకి వస్తే తాను చెప్పాలనుకున్న మెసేజ్ నేరుగా అభిమానులకు చేరే అవకాశం ఉంట్టుంది కాబట్టి ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసినట్టు చెప్పారు చిరంజీవి. అయితే ట్విట్టర్లో కూడా ఎక్కువగా సమాజానికి చేస్తోన్న, చేయాల్సిన సాయానికి సంబంధించిన మెసేజ్లు పోస్ట్ చేస్తున్నారు చిరు. దాంతో మరింతమంది ఆయన్ని ఆదర్శంగా తీసుకుని సాయం చెయ్యడానికి ముందుకు వస్తున్నారు. అలాగే ఈ కష్టసమయంలో ప్రజలకోసం పనిచేస్తున్న పోలీసులను, డాక్టర్స్ని గౌరవించాలి అని కూడా పోస్టులు పెడుతున్నారు.
బి ద రియల్ మ్యాన్..
ప్రస్తుతం టాలీవుడ్లో ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటోన్న మగాళ్లు.. ఆడవాళ్లకు తమవంతు సాయం చేయాలనేది ఈ ఛాలెంజ్ సారాంశం. ఈ ఛాలెంజ్లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవిని నామినేట్ చేశారు. ఈ పిలుపు మేరకు ఇంట్లో స్వయంగా పనులు చేసి ఆ వీడియోను కూడా చిరంజీవి ట్వీట్ చేశారు. ఇదేకాదు, ఇంట్లో తాను చేస్తున్న పనులకు సంబంధించి చాలా వీడియోలు పెడుతూ అందరిలో స్ఫూర్తి నింపుతున్నారు. ఇదిలా ఉంటే, గతంలో తాను స్థాపించిన బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాల్లో కూడా ప్రస్తుతం చురుగ్గా పాల్గొంటున్నారు చిరంజీవి. తాజాగా ఆయన బ్లడ్ బ్యాంక్కు వెళ్లి రక్తదానం కూడా చేశారు.
మరింత మందికి స్ఫూర్తి..
లాక్డౌన్ వల్ల అన్ని బ్లడ్ బ్యాంక్స్లో రక్త నిల్వలు తగ్గిపోతున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని రక్షించడానికి రక్తం దొరకని పరిస్థితి. అందుకే చిరంజీవి ముందుకు వచ్చి స్వయంగా రక్తదానం చేసి ఈ క్లిష్ట పరిస్థితిలో అందరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. దీంతో అనేకమంది ముందుకు వచ్చి రక్తం ఇచ్చారు. ఇలా తన కష్టంతోనే పైకి ఎదిగినా అందులో సమాజం మొత్తాన్ని భాగస్వామ్యం చేస్తూ, చేతనైనంత కాకుండా సినీ కార్మికుల అందరి ఆకలి తీర్చేంత సాయం చేస్తున్న చిరంజీవిని ఆంజనేయుడు భక్తుడిగా కాకుండా తమ కోసం తరలివచ్చిన అభయ ఆంజనేయ స్వామిగా భావించి నమస్కరిస్తున్నారు సాయం అందుకున్న వాళ్ళు. వాళ్ళందరి నోటా ఒకే మాట ‘జై..చిరంజీవ’.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.