యాప్నగరం

సైనైడ్: 20 మంది అమ్మాయిలను చంపిన మానవ మృగం కథతో సినిమా

కరుడుగట్టిన నేరస్థుడు, 20 మంది అమ్మాయిలను హత్యచారం చేసిన వ్యాయామ ఉపాధ్యాయుడు అయిన ‘సైనైడ్’ మోహన్ కథతో సినిమా వస్తోంది. మలయాళ దర్శకుడు రాజేష్ టచ్‌రివర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Samayam Telugu 26 Jun 2020, 7:32 pm
‘సైనైడ్’ మోహన్.. 11 ఏళ్ల క్రితం ఈ పేరు ఓ సంచలనం. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్ట్రక్టర్‌, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేరు మోసిన నేరస్థుడు, 20 మంది యువతుల మరణానికి కారణమైన మానవ మృగం ఈ ‘సైనైడ్‌’ మోహన్‌. అతని కథతో ఇప్పుడు సినిమా వస్తోంది. జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న దర్శకుడు రాజేష్‌ టచ్‌రివర్‌ ‘సైనైడ్’ పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Samayam Telugu దర్శకుడు రాజేష్‌ టచ్‌రివర్‌, ‘సైనైడ్’ మోహన్
Movie on Cyanide Mohan


మిడిల్‌ ఈస్ట్‌ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ప్రవాసీ పారిశ్రామికవేత్త ప్రదీప్‌ నారాయణన్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. ‘అత్యంత అరుదైన కేసులలో ఒకటి’గా కోర్టు పరిగణించిన మోహన్ కథను తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించనున్నారు. గురువారం ‘సైనైడ్‌’ మోహన్‌ ఆఖరి కేసులో తీర్పు వచ్చిన సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. ఆఖరి కేసులో మోహన్‌కు కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది.

Cyanide Movie Title Poster

కాగా, సినిమా గురించి దర్శకుడు రాజేష్‌ టచ్‌రివర్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రేమ పేరుతో అమ్మాయిలకు వల వేసి, కర్ణాటకలోని వివిధ హోటల్‌ రూమ్స్‌కి పిలిచి.. ఆ తర్వాత శారీరక సంబంధం ఏర్పరచుకుని వంచించిన నరరూప రాక్షసుడు ‘సైనైడ్‌’ మోహన్‌. లైంగిక వాంఛలు తీరిన తర్వాత యువతులకు గర్భనిరోధక మాత్రలు అని చెప్పి సైనైడ్‌ పిల్స్‌ ఇచ్చి చంపేవాడు. తర్వాత అమ్మాయిల బంగారు ఆభరణాలతో ఉడాయించేవాడు. ఏమాత్రం కనికరం లేకుండా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 20 మంది యువతుల మరణానికి కారణమాయ్యాడు. ఈ కేసులో మోహన్‌కి 6 మరణశిక్షలు, 14 జీవిత ఖైదులు విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఇలాంటి కథతో ఇప్పుడు సినిమా చేస్తున్నాను. ఈ చిత్రంలో తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ, హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటీనటులు నటిస్తారు’’ అని అన్నారు.

Also Read: అమ్మాయి నచ్చితే ఫస్ట్ డేనే అడిగేస్తా.. టైం వేస్ట్ చేయను: వర్మ షాకింగ్ కామెంట్స్

నిర్మాత ప్రదీప్‌ నారాయణన్‌ మాట్లాడుతూ.. ‘‘కరోనా భయాలు పోయిన తర్వాత, ప్రభుత్వ అనుమతులు తీసుకొని చిత్రీకరణ ప్రారంభిస్తాం. గోవా, బెంగళూరు, మంగుళూరు, కూర్గ్‌, మడక్కరి, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం. రాజేష్‌ టచ్‌రివర్‌ కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం అందిస్తున్నారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత సునీతా కృష్ణన్‌ మా కంటెంట్‌ అడ్వైజర్‌. కమల్‌ హాసన్‌ ‘విశ్వరూపం’, ‘ఉత్తమ విలన్‌’ చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పని చేసిన సదత్‌ సైనుద్దీన్‌ మా చిత్రానికి పని చేస్తున్నారు’’ అని చెప్పారు. కాగా, ఈ చిత్రానికి జార్జ్ జోసెఫ్ సంగీతం సమకూరుస్తుండగా.. తెలుగు డైలాగులను రవి పున్నం రాస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.