యాప్నగరం

తమ్మారెడ్డి భరద్వాజ ఇంట విషాదం.. పరామర్శించిన చిరంజీవి

తమ్మారెడ్డి భరద్వాజను చిరంజీవి ఫోన్ ద్వారా పరామర్శించారు. భరద్వాజ తల్లి మృతిపై చిరంజీవి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Samayam Telugu 6 Apr 2020, 8:18 pm
ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి కృష్ణవేణి సోమవారం మృతిచెందారు. ఆమె వయసు 94 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నేడు తుదిశ్వాస విడిచారు. తన తల్లి కన్నుమూసినట్టు తమ్మారెడ్డి భరద్వాజ సినీ పరిశ్రమలో ఉన్నవారికి, మీడియాకు వెల్లడించారు. వృద్ధాప్యం కారణంగా తన తల్లి రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని.. ఆరోగ్యం విషమించడంతో సోమవారం కన్నుమూశారని భరద్వాజ తెలిపారు.
Samayam Telugu Tammareddy Bharadwaja
తమ్మారెడ్డి భరద్వాజ


తన తల్లి మరణవార్త తెలిసి మిత్రులు, శ్రేయోభిలాషులు ఫోన్లు చేస్తున్నారని.. అయితే, కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నందున తనను పరామర్శించేందుకు ఇంటికి ఎవరూ రావద్దని కోరారు. కాగా, మాతృ వియోగంతో పుట్టెడు దు:ఖంలో ఉన్న భరద్వాజను మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. ఫోన్ ద్వారా భరద్వాజను పరామర్శించిన చిరంజీవి.. ఆయనకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం తమ్మారెడ్డి భరద్వాజ, చిరంజీవి కలిసి సినీ కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటుచేసి విరాళాలు సేకరించి సినీ కార్మికులకు నిత్యావసరాలు అందజేస్తున్నారు.

Also Read: అన్నయ్యకు ఏరోజూ దూరంగా లేను: శ్రీలక్ష్మి కనకాల

ప్రస్తుతం లాక్‌డౌన్ పీరియడ్ నడుస్తుండటంతో తన తల్లి అంత్యక్రియలను కుటుంబసభ్యులతో కలిసి నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే, తమ్మారెడ్డి భరద్వాజ తండ్రి కృష్ణమూర్తి కూడా నిర్మాత అనే సంగతి తెలిసిందే. రవీంద్ర ఆర్ట్స్‌ పతాకంపై ‘లక్షాధికారి’, ‘జమీందారు’, ‘బంగారు గాజులు’, ‘ధర్మదాత’, ‘దత్త పుత్రుడు’, ‘డాక్టర్‌ బాబు’ వంటి హిట్‌ చిత్రాలను ఆయన నిర్మించారు. కృష్ణమూర్తి 2013లో మృతిచెందారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.