యాప్నగరం

Sekhar Kammula: ఆ పాప తల్లిదండ్రుల వేదన చూస్తే నా హృదయం ముక్కలైంది

Sekhar Kammula: బంజారాహిల్స్‌లో DAV పబ్లిక్‌ స్కూల్‌లో నాలుగేళ్ల చిన్నారిపై పాఠశాల ప్రిన్సిపల్ డ్రైవర్ అఘాయిత్యం చేసిన ఘటన అందరినీ కలచివేస్తోంది. ఈ ఘటనపై దర్శకుడు శేఖర్ కమ్ముల ఆవేదన వ్యక్తం చేశారు. నాగరిక సమాజంలో ఇలాంటివి జరగకూడదన్నారు. ‘ఇదొక భయానక ఘటన. మనం మేల్కొవాలి. పిల్లల భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడం. వ్యవస్థలు స్పందించాలి. పిల్లలకు సురక్షితమైన వాతావరణం అందించాలి’ అని శేఖర్ కమ్ముల ట్వీట్ చేశారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 22 Oct 2022, 10:51 pm
హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని DAV పబ్లిక్‌ స్కూల్‌లో ఎల్‌కేజీ చిన్నారిపై జరిగిన అఘాయిత్యం అందరినీ కలచివేస్తోంది. నాలుగేళ్ల చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన నిందితుడు, స్కూల్ ప్రిన్సిపల్ మాధవి కారు డ్రైవర్‌ రజనీ కుమార్‌‌పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అటు సోసల్ మీడియా వేదికగా సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు పలువురు తమ గళం విప్పారు. నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) ఈ ఘటనపై స్పందించారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
Samayam Telugu Sekhar Kammula
శేఖర్ కమ్ముల


‘నాలుగేళ్ల చిన్నారిపై ప్రిన్సిపల్ డ్రైవర్ అఘాయిత్యం చేయడం.. ఇదొక భయాతీ భయంకరమైన ఘటన. నా హృదయం ముక్కలై, నిస్సహాయ స్థితిలో ఉన్నా. ఆ చిన్నారి పడుతోన్న వేదనను ఊహించలేం. ఈ అన్యాయంపై ధైర్యంగా పోరాటం చేస్తున్న పాప తల్లిదండ్రులను చూస్తే నా గుండె కరిగిపోతోంది’ అని శేఖర్ కమ్ముల పేర్కొన్నారు.

నాగరిక సమాజంలో ఇకపై ఇలాంటివి జరగకూడదని.. మనం మేల్కొనాల్సిన సమయం వచ్చిందని శేఖర్ కమ్ముల పిలుపునిచ్చారు. ‘మనం పిల్లల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించం. ఏమాత్రం రాజీ పడం. మనమందరం మేల్కోవాలి. వ్యవస్థలు స్పందించాలి. పిల్లలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించాలి. దీనిపై అవగాహన కల్పించాలి. అప్రమత్తత, పర్యవేక్షణ అవసరం. మనం పిల్లల నమ్మకాన్ని దెబ్బతీస్తే భయంతో కూడిన సమాజాన్ని సృష్టించిన వాళ్లమే అవుతాం’ అంటూ శేఖర్ కమ్ముల ఆవేదన వ్యక్తం చేశారు.


ప్రిన్సిపల్ మాధవి వ్యవహార శైలిపై ఆరోపణలు
స్కూల్ ప్రిన్సిపల్ మాధవి తీరుపైనా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమె వ్యక్తిగత డ్రైవర్‌కు డిజిటల్ క్లాస్ రూములలోకి యథేచ్చగా వచ్చేంత స్వేచ్ఛ ఎందుకు ఉందని టీచర్లు, పాఠశాల సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. వారిద్దరి వ్యవహార శైలిపైనా ఫిర్యాదు చేశారు.

మరోవైపు ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను కస్టడీ కోరుతూ బంజారాహిల్స్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ప్రధాన నిందితుడు రజనీ కుమార్, ప్రిన్సిపాల్ మాదవిని ఐదు రోజుల కస్టడీకి అనుమతించాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు సోమవారం విచారించనుంది. ఇప్పటికే నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి చంచల్‌గూడా జైలుకు తరలించారు.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.