యాప్నగరం

దిగ్గజ గాయకుడు మహమ్మద్ రఫీకి గూగుల్ నీరాజనం

భారతదేశం గర్వించదగిన దిగ్గజ గాయకుడు మహమ్మద్ రఫీ. ఆయన పాట ఓ మధురం. మనం గానగంధర్వుడిగా పిలుచుకునే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. రఫీ పాటంటే పడిచచ్చిపోతారు.

TNN 24 Dec 2017, 10:01 am
భారతదేశం గర్వించదగిన దిగ్గజ గాయకుడు మహమ్మద్ రఫీ. ఆయన పాట ఓ మధురం. మనం గానగంధర్వుడిగా పిలుచుకునే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. రఫీ పాటంటే పడిచచ్చిపోతారు. అంతటి గొప్ప గాయకుడు రఫీ. ఆయనకు ఏ బిరుదు ఇచ్చినా తక్కువే. బతికినంతకాలం, చివరి శ్వాస వరకు పాడుతూనే బతికిన వ్యక్తి మహమ్మద్ రఫీ. సుమారు 5 వేలకు పైగా పాటలు.. అందులో ఎన్నో ప్రేమ గీతాలు, భక్తిరస మధురాలు. ఆ దివంగత గాయకుడి 93వ జయంతి నేడు. రఫీ 93 జయంతి సందర్భంగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఆయనకు నీరాజనం సమర్పించింది. ఒక అందమైన డూడుల్‌తో రఫీని గౌరవించింది. తరచూ ఆన్‌లైన్‌లో ఉండే కొన్ని కోట్ల మందికి ఆ దిగ్గజ గాయకుడిని ఒకసారి గుర్తుచేసింది. ముంబైకి చెందిన ఇలస్ట్రేటర్ సాజిద్ షేక్ రూపొందించిన ఈ డూడుల్ అద్భుతంగా ఉంది.
Samayam Telugu google celebrates mohammed rafis 93rd birthday with a doodle
దిగ్గజ గాయకుడు మహమ్మద్ రఫీకి గూగుల్ నీరాజనం


పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లా కోట్ల సుల్తాన్ సింగ్ గ్రామంలో 1924 డిసెంబర్ 24న జన్మించిన మహమ్మద్ రఫీ.. తన మధురమైన గాత్రంతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. అల్లారఖీ, హాజీ అలీ అహ్మద్ దంపతులకు కలిగిన ఎనిమిది మంది సంతానంలో రఫీ ఏడోవాడు. రఫీకి చిన్నప్పటి నుంచే పాటలపై మక్కువ ఎక్కువ. దాన్ని గమనించిన తండ్రి.. చిన్నతనంలోనే రఫీని ప్రసిద్ధ హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్యాంసుడైన బడే గులాం అలీఖాన్ దగ్గర, ఆ తర్వాత ఉస్తాద్ అబ్దుల్ వాహిద్ ఖాన్ దగ్గర శిష్యుడిగా చేర్పించారు. బాల్యదశ నుంచే వేదికలెక్కి పాడడం, టికెట్ షోలలో ఆలపించడం అలవర్చుకున్నారు రఫీ. సుప్రసిద్ధ గాయకుడు కె.ఎల్. సైగల్‌ను రఫీ విపరీతంగా అభిమానించేవారు.

పంజాబీతో తొలి అవకాశం..
మహమ్మద్ రఫీకి ప్లే బ్యాక్ సింగర్‌గా 1941లో తొలిసారి అవకాశం వచ్చింది. తొలిపాటను ఆయన లాహోర్‌లోని రికార్డింగ్ థియేటర్‌లో ఆలపించారు. ‘గుల్ బలోచ్’ అనే పంజాబీ చిత్రంలో ‘సోనియే నీ, హీరియే నీ’ అనే డ్యూయెట్‌ను జీనత్ బేగంతో కలసి పాడారు. ఆ తరవాత 1944లో ముంబయికి వచ్చేశారు. బాలీవుడ్‌ చిత్రాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముంబైలోని రద్దీ ప్రాంతమైన భేండి బజార్‌లో 10 అడుగుల గదిలో మరో వ్యక్తితో కలిసి రఫీ ఉండేవారు.

‘గావ్ కి గోరి’తో బాలీవుడ్‌లో పాగా..
రఫీకి బాలీవుడ్‌లో తొలి అవకాశం వచ్చింది. ‘గావ్ కి గోరి’ అనే సినిమాలో పాటను రఫీ ఆలపించారు. అంతే ఆయన దశ తిరిగిపోయింది. హిందీ చిత్ర పరిశ్రమకు ఓ మధుర గాత్రం దొరికింది. వరసపెట్టి అవకాశాలు వచ్చాయి. 1960లో ‘చౌధ్వి కా చంద్’ అనే సినిమాలో పాటకు గాను రఫీకి తొలి ఫిల్మ్‌ఫేర్ అవార్డు దక్కింది. ఆ తరవాత వరసగా ఐదు ఫిల్మ్‌ఫేర్‌లు రఫీ గెలుచుకున్నారు. 1977లో జాతీయ అవార్డు వరించింది. 1967లో భారత ప్రభుత్వం రఫీని పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఎస్.డి.బర్మన్, శంకర్-జైకిషన్, మదన్ మోహన్, ఓపీ నయ్యర్ వంటి దిగ్గజ సంగీత దర్శకులతో కలసి రఫీ పనిచేశారు. తన మధురమైన గాత్రంతో ఎన్నో కోట్ల హృదయాలు గెలుచుకున్న మహమ్మద్ రఫీ.. 1980 జులై 31న ముంబైలో తుదిశ్వాస విడిచారు. అప్పటికి ఆయన వయసు 55 ఏళ్లు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.