యాప్నగరం

చాలా బాధగా ఉంది.. ‘నా నువ్వే’పై మహేష్ కోనేరు

తెలుగు సినీ పరిశ్రమలో పీఆర్వోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మహేష్ కోనేరు.. సొంతంగా బ్యానర్‌ పెట్టి కళ్యాణ్ రామ్‌తో ‘నా నువ్వే’ సినిమాను నిర్మించారు.

Samayam Telugu 18 Jun 2018, 3:28 pm
తెలుగు సినీ పరిశ్రమలో పీఆర్వోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మహేష్ కోనేరు.. సొంతంగా బ్యానర్‌ పెట్టి కళ్యాణ్ రామ్‌తో ‘నా నువ్వే’ సినిమాను నిర్మించారు. అయితే నిర్మాతగా ఆయన చేసిన ప్రయత్నం ఫలించలేదు. జయేంద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. తొలిరోజే ఫ్లాప్ టాక్‌ను మూటగట్టుకుని బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలమైంది. సినిమాలో ఒక తమన్నా తప్ప మిగిలిన ఏ అంశమూ ఆకట్టుకోలేదని సగటు ప్రేక్షకుడు పెదవి విరిచాడు. అయితే ‘నా నువ్వే’ పరాజయంపై మహేష్ కోనేరు స్పందించారు. ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు.
Samayam Telugu Naa_Nuvve


‘చాలా బాధగా ఉంది. చాలా నిరుత్సాహంగా ఉంది. ఎందుకంటే మేమంతా మనసు పెట్టి ప్రయత్నించాం. ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. మేం మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంటాం. సినిమా మీద ఉన్న ప్రేమ మమ్మల్ని నడిపిస్తుంది. సినిమాలు తీయడమే మా పని. ఒక రోజు విఫలమైనా మరో రోజు పోరడతాం. ఈసారి ఇంకా బాగా చేస్తాం, ఇంకా కష్టపడి పనిచేస్తాం. కష్టకాలంలో మా వెన్నంటే ఉన్న అందరికీ ధన్యవాదాలు’ అంటూ మహేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
మహేష్ ట్వీట్‌కు స్పందన కూడా బాగానే ఉంది. చాలా మంది ఆయనకు సానుభూతి వ్యక్తం చేశారు. ఒక ట్విట్టరేట్ మాత్రం సినిమా ఫ్లాప్ కావడానికి రివ్యూలే కారణమని, వాటిని బ్యాన్ చేస్తే కొంచె గట్టెక్కుతారని సలహా ఇచ్చాడు. దీనికి మహేష్ స్పందిస్తూ.. ‘కరెక్ట్‌గా తీస్తే మీడియా సపోర్ట్ ఇస్తుంది. దీనికి మంచి ఉదాహరణ ‘సమ్మోహనం’. రివ్యూల్లో అప్పడప్పుడు 10-15% తేడా ఉండొచ్చు. కానీ చాలా సమయాల్లో రివ్యూలు చెప్పేదే నిజం. ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా యుగంలో మీరు దేన్నీ బ్యాన్ చేయలేరు’ అని పేర్కొన్నారు. మొత్తానికి మహేష్ కోనేరుకు ఈ పరాజయం ఒక గుణపాఠం. భవిష్యత్తులో ఆయన మంచి సినిమాలు తీసి విజయాలు అందుకోవాలని ఆశిద్దాం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.