యాప్నగరం

K. Vishwanath: బాలు నా ఆరో ప్రాణం.. దేవుడు అన్యాయం చేశాడంటూ కంటతడి పెట్టుకున్న కె. విశ్వనాథ్

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో తమ తమ జ్ఞాపకాలు, అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు సినీ ప్రముఖులు. బాలు తన సోదరుడే కాదు ఆరో ప్రాణం అంటూ కంటతడి పెట్టుకున్నారు కళాతపస్వి కె. విశ్వనాథ్.

Samayam Telugu 26 Sep 2020, 8:37 am
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణవార్త యావత్ భారతీయ సినీ పరిశ్రమలో విషాదం నింపించి. కరోనాతో పోరాడి గెలిచిన ఆయన చివరకు అనారోగ్యంతో శుక్రవారం మధ్యాహ్నం ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు, తమిళ సినీ ప్రపంచం కన్నీరు పెట్టుకుంటోంది. దిగ్గజ గాయకుడి అస్తమయం ఏ ఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు. మీడియా ఛానల్స్ అన్నింటా బాలు గొప్పతనం, విజయాలు వివరిస్తూ ఆయన గానామృతాన్ని వినిపిస్తున్నారు. ఇండస్ట్రీలోని నటీనటులు, గాయకులు, దర్శకనిర్మాతలు అంతా ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Samayam Telugu బాలు నా ఆరో ప్రాణం.. దేవుడు అన్యాయం చేశాడంటూ కంటతడి పెట్టుకున్న కె. విశ్వనాథ్
K Vishwanath Balu


కాగా తన సోదరుడు బాలు మరణాన్ని తట్టుకోలేకపోయారు కళాతపస్వి కె. విశ్వనాథ్. బాలు తనకు సోదరుడే కాదు ఆరో ప్రాణం అని, ఇంత తొందరగా ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడని అనుకోలేదంటూ ఆవేదన చెందారు. బాలు విషయంలో దేవుడు తనకు తీరని అన్యాయం చేస్తాడని అనుకోలేదంటూ కంటతడి పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో ఇంతకుమించి ఎక్కువ మాట్లాడలేనని చెప్పిన విశ్వనాథ్.. బాలు ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులంతా దైర్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Also Read: బాలూ.. నా మాట వినలేదు.. నీ విషయంలో దానికి పరిమితి లేదు: ఇళయరాజా భావోద్వేగం

ఇక మరికొంతమంది దిగ్గజ సంగీత కళాకారులు బాలును స్మరించుకుంటూ ఆయన మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ''నా కన్నీటిని ఆపుకోలేకపోతున్నాను మామ. హృదయం అంతా బాధతో నిండిపోయింది. మీ ప్రేమ, భక్తి, ఆనందం అన్నింటినీ మిస్‌ అవుతున్నాం'' అని ఏఆర్ రెహమాన్ అన్నారు. ''అందరూ మంచివాళ్లు అవ్వాలనుకోవడం ఎంత అత్యాశ అవుతుందో.. మంచివాళ్లు అందరూ సుఖంగా ఉంటారని ఆశించడం అంతే పొరపాటు అని చెప్పి భగవంతుడు నిరూపించాడు. బాలును తీసుకెళ్లాడు. ఇది సంగీత ప్రపంచానికి దుర్దినం'' అని కీరవాణి ఆవేదన చెందారు.

Also Read: ఆయన తెలుగు వాడంటే ఒప్పుకునేవారు కాదు: బాలు గురించి రాజమౌళి

నిన్న (శుక్రవారం) సాయంత్రం ఎంజీఎం ఆసుపత్రి నుంచి అశ్రునయనాల మధ్య బాలు పార్దీవదేహాన్ని చెన్నై కోడంబాక్కంలో ఉన్న ఆయన స్వగృహానికి తరలించారు. ఈ రోజు (శనివారం) ఉదయం 11 గంటలకు ఆయన అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.