యాప్నగరం

జనతా కర్ఫ్యూ: టాలీవుడ్ హీరో హీరోయిన్లకు పవర్ స్టార్ విజ్ఞప్తి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ‘జనతా కర్ఫ్యూ’లో సినీ పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

Samayam Telugu 20 Mar 2020, 6:51 pm
కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన సూచనలను హృదయ పూర్వకంగా స్వాగతిస్తున్నానని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. గురువారం నాడు జాతిని ఉద్దేశించి మోదీ చేసిన సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఈ నెల 22వ తేదీ ఆదివారాన్ని మోదీ చెప్పినట్టు జనతా కర్ఫ్యూగా పాటిద్దామని పవన్ పిలుపునిచ్చారు. ఆ రోజు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇళ్లకే పరిమితమవుదామని అన్నారు. ఈ మేరకు శుక్రవారం పవన్ కళ్యాణ్ ఒక వీడియోను విడుదల చేశారు.
Samayam Telugu Pawan_Kalyan
పవన్ కళ్యాణ్


కరోనా మహమ్మారిని నిర్మూలించడానికిగాను ప్రమాదమని తెలిసినప్పటికీ క్షేత్రస్థాయిలో పని చేస్తున్న డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్‌, వైద్య ఆరోగ్య సిబ్బంది, మీడియా వారు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా ప్రతి ఒక్కరికీ మనస్సులోనే కృతజ్ఞతలు తెలుపుతూ మన ప్రధాన మంత్రి చెప్పినట్లు ఆదివారం సాయంత్రం అయిదు గంటలకు మన ఇంటి బాల్కనీలలో నిలబడి కరతాళ ధ్వనులు ద్వారా వారికి మన సంఘీభావం తెలుపుదామని పవన్ పిలుపునిచ్చారు.

Also Read: రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్న అమలాపాల్.. ఫొటోలు వైరల్

అయితే, ఈ సందర్భంగా అమెరికాలో చూసిన తన అనుభవాన్ని ప్రజలతో పంచుకున్నారు. ‘‘2001 సెప్టెంబర్‌ 11న ట్విన్‌ టవర్స్‌‌ను టెర్రరిస్టులు కూల్చి వేసినప్పుడు మరణించిన వారికి అంజలి ఘటించడానికి అమెరికన్లు అందరూ ఒకేసారి రోడ్లపైకి వచ్చి మృతులకు సంతాపం తెలిపారు. ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను. ఇది అమెరికన్ల కార్యక్రమం అయినప్పటికీ సాటి మనిషిగా నేనూ పాలుపంచుకున్నాను’’ అని పవన్ చెప్పారు.

సామాజిక సంఘీభావ కార్యక్రమంలో మనమందరం మమేకమవడం మన విధిగా భావిస్తానని పవన్ తెలిపారు. మోదీ పిలుపునకు దేశమంతా స్పదించాలని కోరుకుంటున్నాని అన్నారు. తాను సైతం ఆ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఫేస్‌ బుక్‌ లైవ్‌ నిర్వహిస్తానని వెల్లడించారు. అయితే, ఈ జనతా కర్ఫ్యూలో సినీ పరిశ్రమకు చెందినవారు పాల్గొనాలని పవన్ పిలుపునిచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమ దీనికి సంఘీభావం ప్రకటించాలన్నారు. ప్రతి ఒక్క హీరో, హీరోయిన్, నటీనటులు, 24 క్రాఫ్ట్స్‌కు సంబంధించిన ప్రతీ ఒక్కరూ దీనిలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.