యాప్నగరం

పీవీ సింధు చరిత్రాత్మక విజయంపై స్పందించిన మహేష్‌బాబు

జపాన్ స్టార్, వరల్డ్ ఛాంపియన్ నవొమి ఒకుహరతో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 21-19, 21-17 తేడాతో వరుస సెట్లలో పీవీ సింధు విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది.

Samayam Telugu 16 Dec 2018, 6:52 pm
భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు సూపర్ స్టార్ మహేష్‌బాబు శుభాకాంక్షలు తెలిపారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో బంగారు పతకం సాధించిన పీవీ సింధు.. ఈ ఘనతను అందుకున్న తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. జపాన్ స్టార్, వరల్డ్ ఛాంపియన్ నవొమి ఒకుహరతో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 21-19, 21-17 తేడాతో వరుస సెట్లలో పీవీ సింధు విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. భారీ టైటిల్‌తో ఈ ఏడాదిని ఘనంగా ముగించింది.
Samayam Telugu Mahesh_PVSindhu


ఇంత అద్భుతమైన విజయాన్ని సాధించడంతో వరల్డ్ టూర్ ఫైనల్స్‌ విజేతల జాబితాలో భారత్ పేరును నిలిపిన సింధుపై సూపర్ స్టార్ మహేష్‌బాబు ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేశారు. ‘ఎంత అద్భుతమైన ఘనత!!! బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్‌ను గెలిచిన పీవీ సింధుకి అభినందనలు. నిన్ను చూసి యావత్తు దేశం గర్వపడుతోంది. నువ్వు మరిన్ని ఉన్నత స్థానాలను అందుకోవాలి’ అని ట్వీట్‌లో మహేష్ పేర్కొన్నారు.
కాగా, బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్ టూర్‌ ఫైనల్స్‌లో గత ఏడాది కూడా పీవీ సింధు ఫైనల్‌కి చేరింది. తుదిపోరులో జపాన్ క్రీడాకారిణి అకానే యమగుచి చేతిలో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకుంది. కానీ ఈసారి మాత్రం సింధు కసితో ఆడింది. సిరీస్ ఆరంభం నుంచి మంచి ఫామ్‌ను కనబరిచిన సింధు.. ఫైనల్‌లోనూ దాన్ని కొనసాగించింది. ఏడాది కాలంగా ప్రధాన టోర్నీల్లో తనకు గట్టి పోటీనిస్తోన్న ఒకుహరను ఈసారి మాత్రం సింధు మట్టికరిపించింది. రెండు వరుస సెట్లలోనే ఓడించి సత్తా చాటింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.