Nagababu About Rrr Movie Story And Pawan Kalyan Film Updates
కోహినూర్ డైమండ్ బ్యాక్డ్రాప్.. పవన్, క్రిష్ సినిమా గురించి నాగబాబు
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘RRR’తో పాటు పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబోలో వస్తోన్న సినిమాపై కూడా మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడారు.
Samayam Telugu13 Apr 2020, 5:43 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మంచి జోరుమీదున్నారు. రెండేళ్లపాటు పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయించిన పవన్.. ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. ‘వకీల్ సాబ్’ ఇంచుమించుగా పూర్తయింది. దీంతో పాటు పార్లల్గా క్రిష్ దర్శకత్వంలో సినిమాను కూడా పవన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇది పీరియాడిక్ మూవీ అని.. రాబిన్హుడ్ తరహా పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, అసలు ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటి, సినిమా ఎలా ఉండబోతోంది వంటి ప్రశ్నలకు మెగా బ్రదర్ సమాధానాలు చెప్పారు. రెండు రోజుల క్రితం నాగబాబు ఫేస్బుక్ లైవ్ ద్వారా అభిమానులతో ముచ్చటించారు. ఈ లైవ్లో చాలా మంది చాలా ప్రశ్నలు అడిగారు. వీటిలో RRR సినిమా గురించి, ‘అదిరింది’ షో గురించి, పవన్ సినిమా అప్డేట్స్ గురించి కూడా ఫ్యాన్స్ ప్రశ్నలు అడిగారు. అయితే, ఈ ప్రశ్నలకు ఆ సమయంలో నాగబాబు సరిగా సమాధానం చెప్పలేకపోయారట. అందుకే, వీటికి సమాధానాలు చెబుతూ ఒక ప్రత్యేక వీడియో చేసి తన యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేశారు.
‘RRR’పై నాగబాబు ఒపీనియన్
‘‘భీమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రామరాజుగా రామ్ చరణ్ను చూశాను. రామరాజు పాయింట్ ఆఫ్ వ్యూలో భీమ్ ఎలా ఉంటాడో చూడాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ఫస్ట్ ప్రోమోతోనే చాలా ఇంట్రస్ట్ని గ్రాబ్ చేశారు RRR మేకర్స్. ఈ సినిమా కచ్చితంగా బిగ్గెస్ట్ హిట్ కొడుతుందని నమ్మకం ఉంది. ప్రొడక్షన్లో ఉన్న సినిమాల కథల గురించి నేను అడగను. కాకపోతే, మీలానే నేను విన్నది ఏంటంటే.. రామరాజు, కొమరం భీమ్ ఒకరు ఆంధ్రప్రదేశ్ మన్యం ప్రాంతంలో, మరొకరు తెలంగాణ అటవీ ప్రాంతంలో యుద్ధాలు చేసినవాళ్లు. అయితే, ఈ విప్లవ వీరులు ఇద్దరూ ఒకేకాలానికి చెందినవారా కాదా ఇంకా నేను చెక్ చేసుకోలేదు. ఒక వేళ ఇద్దరూ ఒకేకాలానికి చెందినవారైతే, ఇద్దరూ కలుసుకుంటే ఎలా ఉంటుంది అనేది కథ అని ఒక టాక్ ఉంది. సినిమా థియేటర్కు వచ్చేంత వరకు ఇలాంటి స్పెక్యులేషన్స్ చాలా వస్తుంటాయి. నాకు కూడా ఇంట్రస్టే’’ అని నాగబాబు చెప్పుకొచ్చారు.
‘అదిరింది’ షో గురించి..
‘అదిరింది’ షో గురించి మీరు ఎలా ఫీలవుతున్నారు? ఆ షో మీద మీ ఒపీనియన్ ఏంటి? అని ఓ వ్యక్తి అడిగారట. దీనికి నాగబాబు సమాధానం చెబుతూ.. ‘‘నేను చేసే షో కాబట్టి నాకెప్పుడూ మంచి ఒపీనియనే ఉంటుంది. నాకు ఐడియలాజికల్ డిఫరెన్సెస్ వచ్చి ‘మల్లెమాల’ నుంచి బయటికి రావడం వల్లే ఈ షో మొదలుపెట్టానని ఇప్పటికే మీకు చెప్పాను. లాక్డౌన్ వల్ల ప్రస్తుతం కొన్ని ఎపిసోడ్లు టెలీకాస్ట్ కాలేదు. రిపీట్ వేసుకుంటున్నారు. లాక్డౌన్ ఎత్తేయగానే కొంత గ్యాప్ తరవాత ఈ షో ప్రారంభమవుతుంది. ఒక కొత్తరకమైన షో చేసే అవకాశం నాకు రావడం పట్ల నేను నిజంగా చాలా సంతోషపడుతున్నాను’’ అని నాగబాబు వెల్లడించారు.
‘జబర్దస్త్’కు ‘అదిరింది’కి తేడా..
పై ప్రశ్న అడిగిన వ్యక్తే ‘జబర్దస్త్’కు ‘అదిరింది’కి మధ్య తేడా ఏంటి అని అడిగారట. దానికి కూడా నాగబాబు వివరణ ఇచ్చారు. ‘‘జబర్దస్త్లో ఆల్రెడీ చాలా మంది సీనియర్లు ఉన్నారు. అదిరిందిలో కూడా చంద్ర, ఆర్పీ లాంటి సీనియర్లు.. అలాగే, జబర్దస్త్లో చేసి బయటికి వెళ్లిపోయిన ధన్రాజ్, వేణు కూడా రావడంతో ‘జబర్దస్త్’తో సమానంగా మేం చేస్తున్నాం. కొత్తగా చేరిన ‘గల్లీ బోయ్స్’, ‘రౌడీ బోయ్స్’ టీమ్ల వల్ల ‘అదిరింది’ కూడా ‘జబర్దస్త్’తో సరిసమానమైన క్యాపబిలిటీని సంతరించుకుంది. జబర్దస్త్లో వచ్చిన కొత్తలో అందరికన్నా జూనియర్గా ఉన్న ఆది ఎలా అయితే తారాజువ్వలా లేచి మంచిపేరు సంపాదించుకున్నాడో.. అలాగే, ‘అదిరింది’లో కూడా సద్దాం, భాస్కర్ కూడా అలాగే ఎదుగుతున్నారు. ‘జబర్దస్త్’ బాగానే ఉంది కానీ.. ‘అదిరింది’ కొంచెం ఫ్రెష్గా, రెగ్యులర్ కామెడీకి భిన్నంగా ఉందని నాకు అనిపించింది’’ అని నాగబాబు చెప్పుకొచ్చారు.
‘వకీల్ సాబ్’ వాటి కన్నా బాగుంటుంది..
పవన్ కళ్యాణ్ సినిమా లేటెస్ట్ అప్డేట్ ఏమైనా తెలుసా అని ఒక అభిమాని అడిగారట. దీనికి నాగబాబు స్పందిస్తూ.. ‘‘లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడంలో నేను చాలా పూర్. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న ఫ్యాన్స్ కన్నా నేను ఎక్కువేమీ కాదు. అయితే.. ‘వకీల్ సాబ్’ గురించి కళ్యాణ్ బాబు నాకు ఒక మాట చెప్పాడు.. కచ్చితంగా మంచి సినిమా అవుతుంది అన్నయ్య, నాకు చాలా ఇంట్రస్టింగ్గా ఉంది చేయడం అన్నాడు. ఈ సినిమాను హిందీలో అమితాబ్ బచ్చన్ గారు చేశారు. తమిళంలో అజిత్ హీరోగా వచ్చింది. ఆ రెండు సినిమాలతో పోలిస్తే కొంత యాడెడ్ పాయింట్స్ ఉన్నాయని నేను విన్నాను. ఆ రెండు సినిమాల కన్నా ఇంకో 5 నుంచి 10 శాతం బాగుండే అవకాశం ఉంది’’ అని నాగబాబు వెల్లడించారు.
కోహినూర్ డైమండ్ బ్యాక్డ్రాప్లో..
పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో వస్తోన్న సినిమా గురించి నాగబాబు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా గురించి బయట వింటున్న టాక్ ఏంటంటే.. మొగలాయుల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక వారియర్ కథ అంటున్నారు. కోహినూర్ డైమండ్ బ్యాక్డ్రాప్లో కథ వెళ్తుందని అన్నారు. టైటిల్ ఇంకా నాకు ఐడియా లేదు. ఈ ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర ఉంది. పవన్ కళ్యాణ్ చాలా కాలం తరవాత సినిమాలు చేస్తుండటంతో నేను కూడా చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాను’’ అని చెప్పారు.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.