యాప్నగరం

కృష్ణకు నివాళి అర్పించిన పరుచూరి వెంకటేశ్వరరావు.. ఎంతలా మారిపోయారో..!

సినీ రచయిత, పరుచూరి బ్రదర్స్‌లో ఒకరైన పరుచూరి వెంకటేశ్వరరావు.. సూపర్‌స్టార్ కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించారు. అయితే, ఆయన పరుచూరి వెంకటేశ్వరరావు అని గుర్తుచేస్తే తప్ప గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. వయోభారం కారణంగా పరుచూరి వెంకటేశ్వరరావు బాగా బరువు తగ్గారు. ఈ విషయాన్ని గతంలో పరుచూరి గోపాలకృష్ణ కూడా వెల్లడించారు. తన అన్నయ్య ఆరోగ్యం బాగానే ఉందని.. ఆయన జ్ఞాపక శక్తి కూడా బాగానే పనిచేస్తోందని స్పష్టం చేశారు. అయినప్పటికీ, ఇప్పుడు మరోసారి వెంకటేశ్వరరావును చూసిన వారు అయ్యో ఇలా అయిపోయారంటే అంటున్నారు.

Authored byవరప్రసాద్ మాకిరెడ్డి | Samayam Telugu 15 Nov 2022, 11:31 pm

ప్రధానాంశాలు:

  • గతంలో బక్కచిక్కిన శరీరంతో కనిపించిన పరుచూరి వెంకటేశ్వరరావు
  • ఆయనకు అనారోగ్యం అంటూ ప్రచారం
  • ఈరోజు కృష్ణకు నివాళులు అర్పించిన సీనియర్ సినీ రచయిత
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Paruchuri Venkateswara Rao
నివాళి అర్పిస్తోన్న పరుచూరి వెంకటేశ్వరరావు
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వందల సినిమాలకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించిన దిగ్గజ రచయితలు పరుచూరి బ్రదర్స్. తెలుగు రాష్ట్రాల్లో పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ గురించి తెలియని వారుండరు. అయితే, పరుచూరి బ్రదర్స్‌లో చిన్నవారైన గోపాలకృష్ణ యూట్యూబ్ ద్వారా నేటి తరం వారితో టచ్‌లో ఉన్నారు. కానీ, వెంకటేశ్వరరావు మాత్రం ఇంటికే పరిమితమయ్యారు. చాలా కాలంగా ఆయన బయట కనిపించడం లేదు.
ఆ మధ్య దర్శకుడు జయంత్ సి పరాన్జీతో వెంకటేశ్వరరావు దిగిన ఫొటో ఒకటి బాగా వైరల్ అయ్యింది. ఆ ఫొటోలో వెంకటేశ్వరరావు బక్కచిక్కిన శరీరంతో గుర్తుపట్టలేనంతగా మారిపోవడంతో ఆయనకేదో అయిపోయిందని అంతా కంగారు పడ్డారు. కొన్ని వెబ్‌సైట్లలో అయితే ఆయనకు అల్జీమర్స్ అనే వ్యాధి సోకిందని రాసేశారు. ఇలాంటి వార్తలు, పుకార్లపై వెంకటేశ్వరరావు తమ్ముడు గోపాలకృష్ణ అప్పట్లో స్పందించారు. అన్నయ్య బాగానే ఉన్నారని.. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. 2017లో ఆస్ట్రేలియా వెళ్లి వచ్చిన తరవాత ఆయనకు ఆరోగ్యం కాస్త తేడా చేసిందని.. డాక్టర్లు ఆహార నియమావళి చెబితే దాన్ని ఫాలో అవుతున్నారని.. అందుకే బరువు తగ్గారని వివరణ ఇచ్చారు.

ఆ తరవాత మళ్లీ పరుచూరి వెంకటేశ్వరరావును బయట ప్రపంచం చూడలేదు. అయితే, ఈరోజు మళ్లీ పరుచూరి వెంకటేశ్వరరావు మీడియాకు కనిపించారు. సూపర్‌స్టార్ కృష్ణ భౌతికకాయానికి నివాళులు అర్పించడానికి ఆయన విజయకృష్ణ నిలయానికి వచ్చారు. ఇప్పుడు మరింత గుర్తుపట్టలేనంతగా వెంకటేశ్వరరావు మారిపోయారు. మరింత బక్కపలచగా అయిపోయిన దిగ్గజ రచయిత.. ఒక యువకుడి సహాయంతో కృష్ణ పార్థివదేహాన్ని సందర్శించారు. మహేష్‌బాబుతో మాట్లాడారు.

పరుచూరి వెంకటేశ్వరరావు


అనంతరం మీడియాతో మాట్లాడిన పరుచూరి.. మహేష్ బాబుకు ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకున్నారు. ఈ ఏడాది మహేష్ బాబును వరుస విషాదాలు వెంటాడాయని అన్నారు. మొదట అన్నయ్య రమేష్ బాబు.. తరవాత తల్లి ఇందిరా దేవి.. ఇప్పుడు తండ్రి కృష్ణను మహేష్ కోల్పోయారని, ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదని వెంకటేశ్వరరావు అన్నారు. మహేష్ బాబు ఇప్పుడు సూపర్ స్టార్ అని.. ఆయన్ని నమ్ముకుని ఎంతో మంది బతుకుతున్నారని.. వాళ్లందరి కోసమైనా ఆయన ధైర్యంగా ఉండాలని వెంకటేశ్వరరావు కోరుకున్నారు.

కృష్ణకు పరుచూరి బ్రదర్స్‌తో ఎంతో అనుబంధం ఉంది. కృష్ణకు పరుచూరి బ్రదర్స్ 35 సినిమాలకు పనిచేశారు. పేర్లు వేసుకోకుండా సుమారు మరో 20 సినిమాలకు పరుచూరి బ్రదర్స్ పనిచేశారు. ఈ విషయాన్ని పరుచూరి గోపాలకృష్ణ స్వయంగా చెప్పారు. సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరంటే తమ మనసు అంగీకరించదని గోపాలకృష్ణ అన్నారు. కృష్ణ తమ కోసం చేసిన సాయాన్ని ఆయన వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానెల్‌లో గోపాలకృష్ణ ఒక వీడియో చేసి పెట్టారు. తాము అవకాశాలు లేక ఇబ్బంది పడిన సమయంలో ఇల్లు కట్టుకోవడానికి కృష్ణ సాయం చేశారని గోపాలకృష్ణ గుర్తుచేసుకున్నారు.
రచయిత గురించి
వరప్రసాద్ మాకిరెడ్డి
వరప్రసాద్ మాకిరెడ్డి సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో టెక్నాలజీ, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.