యాప్నగరం

ఎట్ హోమ్: ప్రత్యేక ఆకర్షణగా పవన్!

71వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం (ఆగస్టు 15) సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్ తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు..

TNN 16 Aug 2017, 10:15 am
71వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం (ఆగస్టు 15) సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్ తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. కాగా.. విందుకు హాజరైన సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గవర్నర్ తేనీటి విందుకు పవన్‌ను ఆహ్వానించడం ఇదే తొలిసారి. విందు ముగిసిన తర్వాత పవన్ ఇద్దరు సీఎంలతో కలిసి గవర్నర్‌ నివాసంలోకి వెళ్లారు. ఆ తర్వాత పవన్.. గవర్నర్, కేసీఆర్, చంద్రబాబుతో విడివిడిగా సమావేశమయ్యారు. గవర్నర్ సతీమణి విమలా నరసింహన్ కూడా పవన్‌తో చాలాసేపు చర్చించారు. చాలా మంది నేతలు, అధికారులు పవన్‌తో కరచాలనం చేసి, సెల్ఫీ దిగడానికి ఆసక్తి చూపారు.
Samayam Telugu pawan kalyan is the main attraction at governors at home
ఎట్ హోమ్: ప్రత్యేక ఆకర్షణగా పవన్!


తేనీటి విందు సందర్భంగా పలు ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకున్నాయి. విందుకు అందరికంటే ముందే వచ్చిన పవన్.. వేదిక వద్దకు వెళ్లి గవర్నర్‌, ఇద్దరు సీఎంలతో కరచాలనం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ‘ఐయాం ఉత్తమ్‌..’ అంటూ పవన్‌తో పరిచయం చేసుకోగా.. ‘ఐయాం పవన్‌..’ అంటూ ఆయన చేయి కలపడంతో అందరూ ఒక్కసారిగా నవ్వారు.

పవన్‌ను గవర్నర్‌.. మంత్రి కేటీఆర్‌కు పరిచయం చేయబోగా తామిద్దం స్నేహితులమేనని కేటీఆర్‌ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశించి ‘ఇద్దరూ యువకులే..’ అని వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పక్కనే కూర్చున్నారు. వారిద్దరూ అరగంట పాటు చర్చించుకున్నారు.

తెలంగాణలో మాదక ద్రవ్యాల నియంత్రణ చర్యల గురించి కేసీఆర్ వద్ద ప్రస్తావిస్తూ.. ప్రభుత్వ చొరవను పవన్ ప్రశంసించారు. ఆ తర్వాత ఆయన చంద్రబాబు వద్ద ఉద్దానంలో కిడ్నీ బాధితుల అంశాన్ని ప్రస్తావించారు. బీజేపీ నేత లక్ష్మణ్‌.. పవన్‌తో రాజకీయాల గురించి చర్చించారు. అక్టోబరు నుంచి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తామని, ఇప్పటికే తెలంగాణలో జనసేన నడుస్తోందని పవన్ ఆయనకు వివరించారు.

కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, సుజనాచౌదరి, తమిళనాడు మాజీ గవర్నర్‌ రోశయ్య, ఏపీ శాసనసభాపతి కోడెల, మండలి ఛైర్మన్‌ చక్రపాణి, తెలంగాణ ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌అలీ, ఏపీ మంత్రి కామినేని, తెలంగాణ మంత్రులు తలసాని, లక్ష్మారెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, పి.మహేందర్‌ రెడ్డి, విపక్ష నేతలు జానారెడ్డి, షబ్బీర్‌అలీ, సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఎంపీలు కేశవరావు, డీఎస్‌, జితేందర్‌ రెడ్డి, రెండు రాష్ట్రాల సీఎస్‌లు దినేష్‌కుమార్‌, ఎస్పీ సింగ్‌, తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మ తదితరులు ఈ విందుకు హాజరయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.