యాప్నగరం

హైదరాబాద్ ప్రజలకు బండ్ల గణేష్ సూచన.. ఆ హక్కును కోల్పోతారు!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు ప్రజల నుంచి స్పందన కరువైంది. ఓటు వేయడానికి హైదరాబాద్ ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు.

Samayam Telugu 1 Dec 2020, 5:38 pm
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు అసెంబ్లీ ఎలక్షన్స్ స్థాయిలో హోరాహోరీగా ప్రచారం జరిపాయి పార్టీలు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకొని ఓటర్లను తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేశాయి. టీఆర్ఎస్, బీజేపీ మధ్య అయితే బాహాబాహీలు కూడా జరిగాయి. ఇంతలా ప్రచారం చేసినా ప్రజల్లో చైతన్యం అయితే మాత్రం పెద్దగా రాలేదని అనిపిస్తోంది. మంగళవారం జరిగిన పోలింగ్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి నగర వాసులు పెద్దగా ఆసక్తి చూపలేదు.
Samayam Telugu బండ్ల గణేష్
Bandla Ganesh


హైదరాబాద్ నగర ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సూచిస్తున్నారు. ఇలా సూచించిన వారిలో టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ కూడా ఉన్నారు. ‘‘హైదరాబాదులో ఓటు హక్కు ఉండీ.. ఓటు వేయకుండా ఇంట్లో కూర్చున్న అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా. ఓటు వేయండి. వేయకుంటే మీరు అడిగే హక్కును కోల్పోతారు’’ అని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. బండ్ల ట్వీట్‌కు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ‘‘ఇంత సాఫ్ట్‌గా చెబితే జనాలు మాట వినరు అన్న’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
కాగా, 18 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో మళ్లీ బ్యాలెట్ పద్ధతిలోనే ఓటింగ్ జరుగుతోంది. జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్ల పరిధిలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకూ జరగనుంది. అయితే, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎప్పుడూ పోలింగ్ మందకొడిగానే ఉంటుంది. 30 నుంచి 40 శాతం మధ్యే గతంలో ఓటింగ్ జరిగింది. కానీ, ఈసారి గతం కన్నా తక్కువ శాతం అయ్యేలా కనిపిస్తోంది. మధ్యాహ్నం ఒంటిగంటకి 20 శాతం ఓటింగ్ కూడా నమోదు కాకపోవడం గమనార్హం. సాయంత్రానికి ఇంచుమించుగా 30 శాతం ఓటింగ్ నమోదవుతుందని అంచనా.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.